మోదకొండమ్మ ఉత్సవాలకు ఏర్పాట్లు
ABN , First Publish Date - 2022-05-02T05:49:46+05:30 IST
జిల్లా కేంద్రం పాడేరులో మోదకొండమ్మ ఉత్సవాలను ఈ నెల 15, 16, 17 తేదీల్లో నిర్వహించేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
15, 16, 17 తేదీల్లో నిర్వహణ
కొవిడ్తో రెండేళ్లుగా ఉత్సవాలు జరగని వైనం
ఈ ఏడాది వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
జిల్లా కేంద్రం పాడేరులో మోదకొండమ్మ ఉత్సవాలను ఈ నెల 15, 16, 17 తేదీల్లో నిర్వహించేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కొవిడ్ కారణంగా గత రెండేళ్లు ఉత్సవాలు నిర్వహించలేదు. దీంతో ఈ ఏడాది భక్తుల అంచనాలకు తగ్గట్టుగా వైభవంగా ఉత్సవాలను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గతానికి భిన్నంగా ఈ ఏడాది ఉత్సవాలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలోనే నిర్వహించాలని నిర్ణయించారు. ఆలయ కమిటీ అధ్యక్షురాలు, ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, ప్రధాన కార్యదర్శి కొట్టగుళ్లి సింహాచలంనాయుడు నేతృత్వంలో ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఇప్పటికే ఆలయానికి ముస్తాబు చేశారు. పట్టణంలో విద్యుద్దీపాలంకరణ, అంబేడ్కర్ కూడలి, మెయిన్బజార్, ఆర్టీసీ కాంప్లెక్స్, సినిమాహాలు కూడలి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు ఆలయం నుంచి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగింపుగా శతకంపట్టు వద్దకు తీసుకువెళ్లి అక్కడ ప్రతిష్టించి మూడు రోజులు అక్కడే ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రస్తుతం ఆ శతకంపట్టు పందిరి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. రాష్ట్రంలో పెద్ద గిరిజన పండగగా మోదకొండమ్మ ఉత్సవాలకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉండడం, వేల సంఖ్యలో భక్తులు వస్తారని అంచనా వేయడంతో దానికి తగినట్టు ఏర్పాట్లు చేస్తున్నారు.