ఏపీఐఐసీ భూముల్లో గ్రావెల్‌ దందా

ABN , First Publish Date - 2022-12-31T01:33:19+05:30 IST

అధికార పార్టీ నాయకులు, ఏపీఐఐసీ అధికారులు కుమ్మక్కయారు.

ఏపీఐఐసీ భూముల్లో గ్రావెల్‌ దందా
గ్రీనరీకి కేటాయించిన స్థలంలో గ్రావెల్‌ తవ్విన దృశ్యం

అచ్యుతాపురం, డిసెంబరు 30: అధికార పార్టీ నాయకులు, ఏపీఐఐసీ అధికారులు కుమ్మక్కయారు. సంస్థకు చెందిన ఖాళీ భూముల్లో రాత్రిపూట గ్రావెల్‌ తవ్వి, అమ్ముకుంటున్నారు. డిసెంబరు 15వ తేదీన సెజ్‌లోని ఒక కర్మాగారానికి రెండు వేల క్యూబిక్‌ మీటర్ల గ్రావెల్‌ను రవాణా చేశారని తెలిసింది.

ప్రత్యేక ఆర్థిక మండలి(సెజ్‌)లోని కర్మాగారాల్లో లోతట్టు ప్రదేశాలను పూడ్చడానికి భారీ మొత్తంలో గ్రావెల్‌ కావాలి. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పార్టీ నాయకులు గ్రావెల్‌ దందా మొదలుపెట్టారు. మండలంలోని నునపర్తి పంచాయతీ నడింపల్లి, రాంబిల్లి మండలం పంచదార్లలో డి.పట్టా భూముల చదును పేరుతో భారీ స్థాయిలో గ్రావెల్‌ తవ్వారు. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’లో వరుస కథనాలు రావడంతో గ్రావెల్‌ తవ్వకాలు ఆపేశారు. తాజాగా ఏపీఐఐసీ భూములపై నేతల పడింది. సెజ్‌లో రుషీల్‌ డెకార్స్‌ కర్మాగారం వెనుక గ్రీనరీకి కేటాయించిన భూమిలో గ్రావెల్‌ తవ్వకాలు ప్రారంభించారు. అక్కడ కొంతలోతు తవ్వే సరికి నీరు పడడంతో తవ్వకాలు ఆపేసి, కొద్ది దూరంలో గల మెరక ప్రాంతంలో తవ్వకాలు ప్రారంభించారు.

Updated Date - 2022-12-31T01:33:21+05:30 IST