రాజకీయ కేంద్రంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం
ABN , First Publish Date - 2022-03-05T06:11:21+05:30 IST
ఆంధ్రవిశ్వవిద్యాలయం రాజకీయాల కేంద్రంగా మారిందని టీడీపీ విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గం అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు.
టీడీపీ ‘విశాఖ’ అధ్యక్షుడు పల్లా విమర్శ
విశాఖపట్నం, మార్చి 4: ఆంధ్రవిశ్వవిద్యాలయం రాజకీయాల కేంద్రంగా మారిందని టీడీపీ విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గం అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వందేళ్ల చరిత్ర ఉన్న వర్సిటీలో ఎంతోమంది వీసీలు పనిచేసినా, ప్రస్తుత వీసీ ప్రసాదరెడ్డిలా ఎవరూ రాజకీయ కేంద్రం చేయలేదన్నారు. గౌరవమైన స్థానంలో ఉంటూ రాజకీయాలు చేయడం ఆయనకే చెల్లిందన్నారు.
వర్సిటీలో దళిత అధ్యాపకులను ఇబ్బంది పెట్టారని, రూసా నిధులు ఇష్టానుసారం ఖర్చు చేశారని, 18 కోర్సులు క్లోజ్ చేశారని, రీవేల్యూయేషన్లో అవకతవకలు జరిగాయని విమర్శించారు. అఖిలపక్షం ఛలో ఏయూకు పిలుపునిస్తే అడ్డుకున్నారని, కానీ ఉద్యమం ఆగదన్నారు. ఈ కార్యక్రమంలో దక్షిణం పార్టీ ఇన్చార్జి గండి బాబ్జీ, రాష్ట్ర కార్యదర్శి లొడగల కృష్ణ, మహిళా అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మి, ప్రణవ్గోపాల్, ఏఐఎస్ఎఫ్ జాన్సన్ బాబు పాల్గొన్నారు.