పెను విషాదం
ABN , First Publish Date - 2022-12-02T01:20:27+05:30 IST
ఒడిశాలోని ఖుర్దా రోడ్డులో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు నగరవాసులు మృతిచెందారు.
పొరుగు రాష్ట్రంలో రోడ్డు ప్రమాదం...
నలుగురు నగరవాసులు మృత్యువాత
ఒకరిది విశాలాక్షి నగర్...మరో ఇద్దరు ఎండాడలో నివాసం
మరొక రు ఎక్కడివారనేదానిపై స్పష్టత కరువు
ఒడిశాలోని ఖుర్దా రోడ్డు జంక్షన్లో లారీ ఢీకొన్న కారు
ఎండాడ, డిసెంబరు 1:
ఒడిశాలోని ఖుర్దా రోడ్డులో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు నగరవాసులు మృతిచెందారు. వీరు ప్రయాణిస్తున్న కారు జాతీయ రహదారిపై ఖుర్దా జంక్షన్లో ఆగి వున్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొంది. దీనికి సంబంధించి మృతుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
విశాలాక్షి నగర్కు చెందిన యల్లపు రాకేష్కుమార్ (34), ఎండాడలోని ఎంకే గోల్డ్కోస్ట్లో నివాసం వుంటున్న హిక్మెప్ కబీర్ (28), మారియా ఖాన్ (26), మారియాఖాన్ బీచ్రోడ్డులో నిర్వహిస్తున్న బ్యూటీపార్లర్లో అసిస్టెంట్గా పనిచేస్తున ్న లావణ్య కలిసి ఒడిశాలో ఏదో ఈవె ంట్ కోసం బుధవారం రాత్రి కారులో బయలుదేరి వెళ్లారు. గురువారం తెల్లవారుజామున వీరి వాహనం ఖుర్దా రోడ్డు వద్ద లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో నలుగురూ మృత్యువాతపడ్డారు. కాగా మృతుల్లో ఒకరైనా రాకేష్కుమార్ అలియాస్ రాఖీ హైదరాబాద్లోని హెచ్ఎస్బీసీలో ఉద్యోగం చేస్తున్నారు. ప్రస్తుతం ఇంటి వద్ద నుంచి పనిచేస్తున్నారు. విశాలాక్షి నగర్లోని ఒక అపార్టుమెంట్లో తల్లితో కలిసి నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం రాకేష్ అయ్యప్ప దీక్షలో ఉన్నారు. బుధవారం రాత్రి 8.30 గంటలకు పూజ ముగించుకున్న రాఖీ...తాను స్నేహితులతో కలిసి కారులో వేరే పనిమీద ఒడిశా వెళుతున్నానని, అదేదారిలో పూరీ ఆలయానికి వెళ్లొస్తానని తల్లికి చెప్పి వెళ్లాడు. ఇంతలోనే రాఖీ మృతిచెందిన వార్త వినడంతో అతని తల్లి గుండెలవిసేలా రోదిస్తున్నారు. రాఖీ జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ (జేసీఐ)లో సభ్యుడిగా ఉంటూ అనేక సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటాడని అతని స్నేహితులు చెబుతున్నారు. ఫొటోగ్రఫీ అతనికి హాబీ కావడంతో తరచూ దూర ప్రయాణాలు చేస్తుంటాడని వారు తెలిపారు. మృతుల్లో మరో ఇద్దరు హిక్మెప్ కబీర్తోపాటు మారియాఖాన్...గత ఏడాదిన్నరగా ఎండాడలోని గోల్డ్ కోస్ట్ అపార్టుమెంట్స్లో నివాసం ఉంటున్నారు. వీరిద్దరిదీ బిహార్ అని, కబీర్ కొంతకాలం కిందటి వరకూ ఆఫ్ఘనిస్తాన్లో పనిచేసే వాడని అపార్టుమెంట్ వాసులు చెబుతున్నారు. మారియాఖాన్ బీచ్ రోడ్డులో బ్యూటీ పార్లర్ నడుపుతున్నట్టు పేర్కొన్నారు. వీరితోపాటు మృతిచెందిన లావణ్య...మారియా నిర్వహిస్తున్న బ్యూటీపార్లర్లో సహాయకురాలిగా పనిచేస్తోంది. అయితే ఆమె ఎక్కడివారనే దానిపై స్పష్టమైన సమాచారం తెలియరాలేదు. అలాగే కబీర్, మారియాఖాన్ ఎక్కడి వారు?, ఎంతకాలం నుంచి నగరంలో ఉంటున్నారు?...అనే వివరాలు కూడా తెలియరాలేదు. వీరంతా ఒడిశాలో ఒక శుభకార్యానికి వెళ్లి అటునుంచి పూరీ వెళతామని బుధవారం సాయంత్రం అపార్టుమెంట్లోని కొందరికి చెప్పినట్టు చెబుతున్నారు.