హాకీ క్రీడాకారిణి భవానికి ఘన స్వాగతం
ABN , First Publish Date - 2022-06-30T06:31:55+05:30 IST
భారత జట్టు తరఫున జూనియర్ ఉమెన్స్ హాకీ ఐదు దేశాల టోర్నీలో తలపడి అనకాపల్లి జిల్లా ఎలమంచిలికి బుధవారం చేరుకున్న ధర్మవరానికి చెందిన క్రీడాకారిణి మడుగల భవానికి ఘనస్వాగతం లభించింది.
ఎలమంచిలి, జూన్ 29 : భారత జట్టు తరఫున జూనియర్ ఉమెన్స్ హాకీ ఐదు దేశాల టోర్నీలో తలపడి అనకాపల్లి జిల్లా ఎలమంచిలికి బుధవారం చేరుకున్న ధర్మవరానికి చెందిన క్రీడాకారిణి మడుగల భవానికి ఘనస్వాగతం లభించింది. ఇక్కడి రాజీవ్ గాంధీ క్రీడామైదానంలో సీనియర్, తోటి క్రీడాకారులు స్థానిక కోచ్లు పూలవర్షం కురి పిస్తూ ఆమెను స్వాగతించారు. తొలుత ఆమెతో కేక్ కట్చేయిం చారు. ఎలమంచిలి ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్లిన ఆమెను అంతా ప్రశంసలతో ముంచెత్తారు. ఈ నెల 19 నుంచి 26 తేదీ వరకూ ఐర్లాండ్ దేశంలో జరిగిన టోర్నమెంటులో భారత జట్టులో ఫార్వార్డ్ స్థానంలో ఈమె ఆడింది. ఫైనల్స్లో నెదర్లాండ్తో ఆడి రన్నర్గా మన జట్టు నిలిచినట్టు ఆమె వివరించింది. ఇదిలావుంటే, ఒలింపిక్స్లో భారత జట్టు తరఫున హాకీలో ఆడడమే తన లక్ష్యమని భవాని‘ఆంధ్రజ్యోతి’కి తెలిపింది. తన తల్లిదండ్రులు మడుగుల వరలక్ష్మి, బాబూరావులతో పాటు హాకీ ఆంధ్రప్రదేశ్, ఎలమంచిలి అసోసియేషన్లు, స్థానిక క్రీడాకారులు అందించిన ప్రోత్సాహం గొప్పదని పేర్కొంది. రానున్న రోజుల్లో మరింత కఠోరంగా శ్రమించి కోచ్ల సూచనలు, సలహాల మేరకు ముందుకు సాగుతానని చెప్పింది.