జీవకోటి కణ పరిమాణం ఒకటే...సంఖ్య మాత్రమే తేడా
ABN , First Publish Date - 2022-08-18T06:22:01+05:30 IST
జీవకోటిలో ఈగ నుంచి ఏనుగు వరకు శరీరంలోని కణాల పరిమాణం ఒకే విధంగా ఉంటుందని, కణాల సంఖ్య మాత్రమే మారుతూ ఉంటుందని, వీటి స్వభావాన్ని అర్థం చేసుకునేందుకు నిరంతర పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయని టాటా ఇనిస్టిట్యూట్ ఫర్ జెనెటిక్స్ అండ్ సొసైటీ డైరెక్టర్ డాక్టర్ రాకేష్ మిశ్రా అన్నారు.

గీతం బయోటెక్నాలజీ వర్క్షాప్లో డాక్టర్ రాకేష్మిశ్రా
విశాఖపట్నం, ఆగస్టు 17 : జీవకోటిలో ఈగ నుంచి ఏనుగు వరకు శరీరంలోని కణాల పరిమాణం ఒకే విధంగా ఉంటుందని, కణాల సంఖ్య మాత్రమే మారుతూ ఉంటుందని, వీటి స్వభావాన్ని అర్థం చేసుకునేందుకు నిరంతర పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయని టాటా ఇనిస్టిట్యూట్ ఫర్ జెనెటిక్స్ అండ్ సొసైటీ డైరెక్టర్ డాక్టర్ రాకేష్ మిశ్రా అన్నారు.
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ సైన్స్ బయోటెక్నాలజీ విభాగం, ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ (ఇన్సా) సంయుక్తంగా రెండు రోజుల పాటు ‘రీసెంట్ అడ్వాన్సెస్ ఇన్ జినామిక్స్ అండ్ ట్రాన్స్ జెనిసిస్’ అనే అంశంపై నిర్వహిస్తున్న జాతీయ స్థాయి వర్క్షాప్లో బుధవారం ఆయన ప్రసంగించారు. అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కణాల నిర్మాణాన్ని, స్వరూప స్వభావాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు.
ఈ సందర్భంగా తమ ప్రయోగశాలలో డ్రాసోఫిలా అనే ఈగ అండంపై జరిపిన పరిశోధన వివరాలను ఆయన వెల్లడించారు. కణ నిర్మాణం, జన్యువుల విశ్లేషణ ద్వారా భవిష్యత్తులో జీవరాశుల శరీర నిర్మాణానికి మూలాలలను గుర్తించడం సాధ్యపడుతుందన్నారు.
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ప్రొఫెసర్ కృష్ణవేణి మిశ్రా మాట్లాడారు. కార్యక్రమంలో శాస్త్రవేత్త డాక్టర్ ఇమ్రాన్ సిద్ధికి, బయోటెక్నాలజీ విభాగం అధిపతి ప్రొఫెసర్ బి.వీరెంద్రకుమార్, వర్క్షాప్ కో-ఆర్డినేటర్ డాక్టర్ జి.వి.శిరీష తదితరులు పాల్గొన్నారు.