Weddings : తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి సందడి

ABN , First Publish Date - 2022-11-30T03:49:19+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లో వచ్చే నెలలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. వేద మంత్రాల సాక్షిగా వేలాది జంటలు ఒక్కటవనున్నాయి.

Weddings : తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి సందడి

డిసెంబరులో వేలాదిగా వివాహాలు

కల్యాణ మండపాలు, హాళ్లు ఫుల్‌

మూఢాలతో మూడు నెలలుగా బ్రేక్‌

మాఘ మాసంలో కొన్నే ముహూర్తాలు

ఏప్రిల్‌లో మళ్లీ మూఢం.. అందుకే హడావుడి

పిప్పిప్పి.. డుండుండుం..!

తెలుగు రాష్ట్రాల్లో వచ్చే నెలలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. వేద మంత్రాల సాక్షిగా వేలాది జంటలు ఒక్కటవనున్నాయి. డిసెంబరు 2 నుంచి భారీ సంఖ్యలో జరగనున్న పెళ్లిళ్లతో తెలుగు రాష్ట్రాలు కళకళలాడనున్నాయి. డిసెంబరులో కూడా నాలుగైదు మాత్రమే మంచి ముహూర్తాలు ఉండడంతో వివాహాలు, రిసెప్షన్‌ వేడుకలతో మండపాలు కిక్కిరిసిపోనున్నాయి. సాధారణంగా ఆశ్వయుజ, కార్తీక, మార్గశిర మాసాల్లో పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు జరుగతాయి. అయితే మూడు నెలలుగా మూఢాల కారణంగా ‘మాంగళ్యం తంతునానేనా’కు బ్రేక్‌ పడింది. అక్టోబరు, నవంబరుల్లో మంగళవాయిద్యాల ముచ్చటే లేకుండా పోయింది. నవంబరు నెలాఖరుతో మూఢం ముగియడంతో కొత్త జంటలు వివాహ వేడుకలకు సిద్ధమయ్యాయి.

2023 మే దాకా ఆగాల్సిందే!

డిసెంబరు 2 నుంచి 21 వరకే మంచి రోజులున్నాయి. ఆ తర్వాత పుష్యమాసం వస్తుంది. ఆ నెలంతా, అంటే జనవరి రెండో భాగం వరకు మంచి ముహూర్తాలు లేవు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో (మాఘ, ఫాల్గుణ మాసాల్లో) కొద్ది సంఖ్యలోనే ముహూర్తాలు ఉన్నాయి. ఏప్రిల్‌లో ఉగాది తర్వాత చైత్రమాసంలో మళ్లీ మౌఢ్యం వస్తోంది. శుభ ముహూర్తాలు మేలో కానీ ఉండవు. దీంతో డిసెంబరులో అందుబాటులో ఉన్న కొన్ని ముహూర్తాల్లోనే ఎక్కువ మంది పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటున్నారని పండితులు చెబుతున్నారు. ఒక్క హైదరాబాద్‌లోనే డిసెంబరు 20లోగా వేలాది వివాహాలు జరగనున్నాయని ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ వర్గాలు అంటున్నాయి. దీంతో కల్యాణ మండపాలకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది.

ఎన్నారైలకు డిసెంబరే బెస్ట్‌!

ఇప్పుడు విదేశాల నుంచి రాకపోకలపై ఆంక్షలు సడలించారు. పైగా డిసెంబరులో అమెరికాలో క్రిస్మస్‌ సందడి ఉంటుంది. ఎన్నారైలకు తేలిగ్గా సెలవులు దొరుకుతాయి. దీంతో విదేశాల్లో ఉద్యోగాల్లో స్థిరపడిన యువతీ యువకులు స్వదేశంలో వాలిపోయి ఓ ఇంటివారవుతున్నారు. దగ్గరి బంధువులు విదేశాల్లో ఉన్నవారు కూడా డిసెంబరు అయితే సౌకర్యంగా ఉంటుందని వివాహాలు నిశ్చయించుకున్నారని సికింద్రాబాద్‌కు చెందిన పురోహితుడు విష్ణుభట్ల సుబ్రహ్మణ్య శర్మ చెప్పారు.

Updated Date - 2022-11-30T03:49:25+05:30 IST