‘అమరావతి’ నినాదానికి స్వస్తి పలకాలి
ABN , First Publish Date - 2022-11-30T03:08:56+05:30 IST
అమరావతే రాజధాని అనే నినాదానికి స్వస్తి పలకాలి. ఆరుమాసాల్లో ఇంటిని నిర్మించుకోవడమే కష్టం’ అని అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు.
సుప్రీం వ్యాఖ్యలతో వికేంద్రీకరణకు తొలగిన అడ్డంకి: స్పీకర్
శ్రీకాకుళం, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): ‘అమరావతే రాజధాని అనే నినాదానికి స్వస్తి పలకాలి. ఆరుమాసాల్లో ఇంటిని నిర్మించుకోవడమే కష్టం’ అని అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన శ్రీకాకుళంలో విలేకర్లతో మాట్లాడారు. ‘చట్టాలు చేసే శాసన వ్యవస్థను శాసించాలని చూడటం న్యాయవ్యవస్థకు సరికాదనే న్యాయ నిపుణుల అభిప్రాయాలను సుప్రీంకోర్టు గుర్తుచేయడం శుభపరిణామం. అమరావతే రాజధాని అనే అంశంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం వెలుబుచ్చిన అభిప్రాయంపై హర్షం వ్యక్తం చేస్తున్నా. శాసన వ్యవస్థ చర్యలను తప్పుపట్టడం విషయంలో హైకోర్టు జోక్యం సరికాదని సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యతో న్యాయవ్యవస్థలపై అచంచలమైన విశ్వాసం కలిగింది. ఆరుమాసాల్లో అమరావతి రాజధాని నిర్మించి తీరాల్సిందే అంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు సరికాదని సుప్రీంకోర్టు పేర్కొనడం రాష్ట్ర ప్రజానీక విజయం ఇది. ప్రతిపక్షాలు ఇకనైనా రాష్ట్రప్రభుత్వానికి సహకరించి పాలనావికేంద్రీకరణకు మద్దతు పలకాలి. కర్నూలులో న్యాయరాజధాని, అమరావతిలో శాసనరాజధాని వంటివి ఏర్పాటుతోనే రాష్ట్రం అభివృద్ధి బాట పడుతుంది’ అని స్పీకర్ అన్నారు.