ఏం కష్టమొచ్చిందో?

ABN , First Publish Date - 2022-12-05T00:12:44+05:30 IST

ఆ కన్నతల్లికి ఏం కష్టమొచ్చిందో ఏమో. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తెకు విషం పెట్టింది. ఆపై తాను కూడా విషం తాగింది. అపస్మారక స్థితికి చేరుకున్న వారిద్దరినీ కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయినా ఫలితం లేకపోయింది. ఇద్దరూ చికిత్స పొందుతూ మృతి చెందారు. హిరమండలం సుభలయ కాలనీలో ఈ విషాదం చోటుచేసుకుంది.

ఏం కష్టమొచ్చిందో?
రజినీ, జ్యోత్స్న ఫైల్‌ఫొటోలు

కుమార్తెకు విషం పెట్టిన తల్లి

ఆపై తానూ తాగిన వైనం

జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ ఇద్దరూ మృతి

హిరమండలం సుభలయ కాలనీలో విషాదం

హిరమండలం, డిసెంబరు 4 : ఆ కన్నతల్లికి ఏం కష్టమొచ్చిందో ఏమో. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తెకు విషం పెట్టింది. ఆపై తాను కూడా విషం తాగింది. అపస్మారక స్థితికి చేరుకున్న వారిద్దరినీ కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయినా ఫలితం లేకపోయింది. ఇద్దరూ చికిత్స పొందుతూ మృతి చెందారు. హిరమండలం సుభలయ కాలనీలో ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. హిరమండలంలోని సుభలయ కాలనీ ఎస్టీ వీధికి చెందిన తంప వెంకటరమణ, రజినీ దంపతులు కూలి చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరద్దరికి 2015లో వివాహం కాగా.. హర్షిణి(5), జ్యోత్స్న(3) ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వెంకటరావు తాపి పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఎప్పటిలాగే శుక్రవారం మామిడిజోలలో పనికి వెళ్లాడు. ఇంతలో ఏమైందో ఏమో కానీ.. మధ్యాహ్న సమయంలో రజనీ తన రెండో కుమార్తె జ్యోత్స్నకు విషం పెట్టింది. ఆపై ఆమె కూడా విషం తాగింది. కొద్ది సేపటి తర్వాత జ్యోత్స్న, రజనీలు అపస్మారక స్థితికి చేరుకున్నారు. వెంటనే కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి వారిద్దరినీ తరలించారు. వైద్యులు ప్రథమ చికిత్స చేసి.. వారి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. శ్రీకాకుళంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి(జీజీహెచ్‌) రిఫర్‌ చేశారు. ఈ విషయాన్ని వెంకటరావుకు బంధువులు ఫోన్‌లో చెప్పారు. వెంటనే వెంకటరావు ఆస్పత్రికి చేరుకున్నాడు. రాత్రి 11.30 గంటల సమయంలో శ్రీకాకుళంలోని జీజీహెచ్‌కు 108 వాహనంలో తల్లీకుమార్తెను తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం జ్యోత్స్న మృతి చెందింది. శనివారం అర్ధరాత్రి తల్లి రజినీ కూడా ప్రాణాలు కోల్పోయింది. దీంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. తహసీల్దార్‌ మురళీమోహనరావు జీజీహెచ్‌కు వెళ్లి శవపంచనామా నిర్వహించారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి.. ఆదివారం సాయంత్రం సుభలయ గ్రామానికి తీసుకువచ్చి దహన సంస్కారాలు చేశారు. కాగా.. కుమార్తెకు విషం పెట్టడంతో పాటు రజినీ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. వెంకటరమణ ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ ఎం.గోవిందరావు తెలిపారు.

Updated Date - 2022-12-05T00:12:47+05:30 IST