చిలకపాలెం టోల్ప్లాజా ఎత్తివేత
ABN , First Publish Date - 2022-12-07T23:07:54+05:30 IST
ఎచ్చెర్ల మండలం చిలకపాలెం జాతీయ రహదారిపై ఉన్న టోల్ప్లాజాను బుధవారం అర్ధరాత్రి నుంచి ఎత్తివేశారు. దీనికి సంబంధించి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పీడీ శివశంకర్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఎచ్చెర్ల, డిసెంబరు 7: ఎచ్చెర్ల మండలం చిలకపాలెం జాతీయ రహదారిపై ఉన్న టోల్ప్లాజాను బుధవారం అర్ధరాత్రి నుంచి ఎత్తివేశారు. దీనికి సంబంధించి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పీడీ శివశంకర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి లోక్సభలో మాట్లాడుతూ 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న టోల్ప్లాజాలు ఎత్తివేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో జిల్లాకు సంబంధించి చిలకపాలెం టోల్ప్లాజాను ఎత్తివేస్తున్నారు. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా చిలకపాలెంలో 2007లో టోల్ప్లాజాను ఏర్పాటు చేశారు. దీనిద్వారా రోజుకు సుమారు రూ.22లక్షల వరకు వసూలవుతోంది. తాజాగా ఈ టోల్ప్లాజాను ఎత్తివేస్తున్నప్పటికీ ఈ ఆర్థిక భారాన్ని మడపాం, నాతవలస టోల్ప్లాజాలపై వేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. కాగా ఇక్కడ పనిచేస్తున్న 107 మంది సిబ్బందిని మడపాం, నాతవలస టోల్ప్లాజాల వద్ద సర్దుబాటు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు గురువారం ఉదయం టోల్ప్లాజా వద్ద ధర్నా చేస్తున్నట్టు సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు తెలిపారు.