అట్రాసిటీ కేసుపై డీఎస్పీ దర్యాప్తు
ABN , First Publish Date - 2022-01-22T05:17:35+05:30 IST
అట్రాసిటీ కేసుపై డీఎస్పీ దర్యాప్తు
రాజాం రూరల్ : విధి నిర్వహణలో ఉన్న తనపై దాడిచేసి కులం పేరుతో దూషించారని ఆగూరు వీఆర్వో కొల్లి రాము (అబ్బాస్) ఇచ్చిన ఫిర్యాదు మేరకు శుక్రవారం ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ (శ్రీకాకుళం) బాలరాజు, రాజాం టౌన్ సీఐ పి.శ్రీనివాసరావు గ్రామంలో దర్యాప్తు నిర్వహించారు. అనంతరం గ్రామానికి చెందిన ఐదుగురు యువకులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. దీనిపై సీఐ శ్రీనివాసరావు అందించిన సమాచారం ఇలా.. యువ కులు సచివాలయం సమీపంలోని మార్గంలో ఈనెల 20న సిమెంట్ బెంచీలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమయంలో వీఆర్వో కొల్లి రాము ఆ ప్రాంతంలో కాకుండా మరో ప్రాంతంలో వాటిని ఏర్పాటు చేయాలని సూచించారు. అయితే యువకులు వీఆర్వోతో విభేదించారని.. ఫలితంగా వారి మధ్య వివాదం జరిగి కులం పేరుతో రామును దూషించారన్నారు. ఈమేరకు గ్రామానికి చెందిన కోడిబోయిన ఎర్రన్న, నక్కిట్ల రాంబాబు, నక్కిట్ల అప్పలనాయుడు, కోనారి వినోద్, కోనారి కృష్ణలపై కేసు నమోదు చేసినట్టు వివరించారు.