అమ్మో అక్టోబరు

ABN , First Publish Date - 2022-10-08T05:00:35+05:30 IST

అక్టోబరు నెల అంటేనే రైతులు హడలిపోతున్నారు. ఏటా ఇదే నెలలో ప్రకృతి వైపరీత్యాలు లేదా ఏదో ఒక విపత్తు సంభవించడమే ఇందుకు కారణం. గతంలో పెను తుఫాన్‌లన్నీ అక్టోబరులో వచ్చి.. విధ్వంసం సృష్టించాయి. కొబ్బరి, జీడి, మామిడి, వరి, మొక్కజొన్న, అరటి తదితర పంటలకు ముప్పు వాటిల్లి.. రైతులకు తీవ్ర నష్టం కలిగించాయి. తాజాగా అల్పపీడన భయం రైతులను వెంటాడుతోంది. నాలుగైదు రోజులుగా జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో ఈ సారి తమకు ఎంత నష్టం మిగులుతుందోనని రైతుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది.

అమ్మో అక్టోబరు
తితలీ తుఫాన్‌లో సోంపేట మండలంలో నేలకొరిగిన కొబ్బరి చెట్లు (ఫైల్‌ఫోటో)

- ఏటా ఏదో ఒక విపత్తు
- ఈ నెలంటేనే హడలిపోతున్న రైతులు
- తాజాగా వెంటాడుతున్న అల్పపీడన భయం
(సోంపేట)

అక్టోబరు నెల అంటేనే రైతులు హడలిపోతున్నారు. ఏటా ఇదే నెలలో ప్రకృతి వైపరీత్యాలు లేదా ఏదో ఒక విపత్తు సంభవించడమే ఇందుకు కారణం. గతంలో పెను తుఫాన్‌లన్నీ అక్టోబరులో వచ్చి.. విధ్వంసం సృష్టించాయి. కొబ్బరి, జీడి, మామిడి, వరి, మొక్కజొన్న, అరటి తదితర పంటలకు ముప్పు వాటిల్లి.. రైతులకు తీవ్ర నష్టం కలిగించాయి. తాజాగా అల్పపీడన భయం రైతులను వెంటాడుతోంది. నాలుగైదు రోజులుగా జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో ఈ సారి తమకు ఎంత నష్టం మిగులుతుందోనని రైతుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది.
కొబ్బరి పంటతో కళకళలాడే ఉద్దానం ప్రాంత స్వరూపాన్ని.. 1999వ సంవత్సరం అక్టోబరు చివరి వారంలో వచ్చే తుఫాన్‌ పూర్తిగా మార్చేసింది. వందలాది ఎకరాల్లో కొబ్బరి, జీడి చెట్లు నేలకూలాయి. ఉద్దానం ప్రాంత రైతుల బతుకులు తలకిందులయ్యాయి. తర్వాత 2012వ సంవత్సరం అక్టోబరులో ఫైలిన్‌, 2013వ సంవత్సరం అక్టోబరులో హుద్‌హుద్‌ తుఫాన్‌లు కూడా రైతులను నిలువునా ముంచేశాయి. కొబ్బరి, జీడి, మామిడి, వరి పంటలు దెబ్బతిన్నాయి. 2018 అక్టోబరులో వచ్చిన తితలీ తుఫాన్‌ మరింత బీభత్సం సృష్టించింది. ఉద్దానంలో వేలాది ఎకరాల్లో కొబ్బరి, జీడి, మామిడి చెట్లు నేలకొరిగాయి. ఈ తుఫాన్‌ రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఇలా ఏటా అక్టోబరులోనే తుఫాన్‌లు రైతుల పాలిట శాపంగా మారుతున్నాయి. తాజాగా అల్పపీడన ప్రభావంతో వర్షాలు ముమ్మరంగా కురుస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గాలుల ప్రభావంతో కొబ్బరి చెట్లు కూలిపోతే.. తమకు ఇక వలసలు తప్పవని వాపోతున్నారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోతున్నా.. తమకు ప్రభుత్వం సక్రమంగా పరిహారం అందజేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతవరకు చాలామంది రైతులకు పైలిన్‌ తుఫాన్‌ పరిహారం అందలేదని పేర్కొంటున్నారు. హుద్‌హుద్‌ తుఫాన్‌ సమయంలో కూడా వేలాది చెట్లు నేలకూలగా.. రుణమాఫీలో కొబ్బరి రైతుల పేర్లను చేర్చలేదన్నారు. తితలీ తుఫాన్‌కు సంబంధించి.. అదనపు పరిహారం కూడా చాలామందికి అందలేదని రైతులు ఆరోపిస్తున్నారు.  ప్రభుత్వం స్పందించి బాధిత రైతులందరినీ ఆదుకోవాలని కోరుతున్నారు.

 

Updated Date - 2022-10-08T05:00:35+05:30 IST