5,020 మంది.. బడి బయటే!

ABN , First Publish Date - 2022-10-07T05:37:21+05:30 IST

విద్యాహక్కు చట్టం ప్రకారం బడి ఈడు పిల్లలందరూ పాఠశాలలోనే ఉండాలి. ఆ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నా.. చాలా మంది చిన్నారులు బడిబయటే ఉంటున్నట్టు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బడి బయట ఉన్న పిల్లలందరినీ పాఠశాలల్లో చేర్పించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.

5,020 మంది.. బడి బయటే!
ఇచ్ఛాపురంలో ప్రత్యేక డ్రైవ్‌ ద్వారా బడిబయట పిల్లలను గుర్తిస్తున్న దృశ్యం

- ఆ విద్యార్థులను పాఠశాలల్లో చేర్పించాలని ప్రభుత్వ ఆదేశం

- వివరాలు సేకరిస్తున్న అధికారులు 

(ఇచ్ఛాపురం రూరల్‌) 

విద్యాహక్కు చట్టం ప్రకారం బడి ఈడు పిల్లలందరూ పాఠశాలలోనే ఉండాలి. ఆ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నా.. చాలా మంది చిన్నారులు బడిబయటే ఉంటున్నట్టు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బడి బయట ఉన్న పిల్లలందరినీ పాఠశాలల్లో చేర్పించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. జిల్లాలో మొత్తం 3079 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 2,88,351 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇంకా 5,020 మంది విద్యార్థులు బడిబయటే ఉన్నట్లు సమగ్రశిక్ష నివేదిక తెలియజేస్తుంది. ప్రత్యేక డ్రైవ్‌లో 2000లకు పైగా నమోదు చేశారు. మరో 1500లకు పైగా మైగ్రేడ్‌ ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ‘మనబడి నాడు-నేడు’కు శ్రీకారం చుట్టి అధునాతన మౌలిక వసతులు కల్పిస్తున్నారు. అమ్మఒడి, జగనన్న విద్యాకానుక, గోరుముద్ద, ఉపకారవేతనాలు ఇస్తున్నారు. అయినా అన్ని మండలాల్లోనూ విద్యార్థులు బడికి దూరంగా ఉండడంతో విద్యారంగ నిపుణులు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఎందుకిలా మానేస్తున్నారని ఆలోచనలో పడ్డారు.


లోపం ఎవరిది.. : 

ఉన్నతాధికారుల ఆదేశాలతో క్షేత్రస్థాయి సిబ్బంది మండలాల వారీగా విద్యార్థుల ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. పలు ప్రాంతాల్లో ఇప్పటి వరకు జరిగిన పరిశీలన ప్రకారం చూస్తే గతంతో పోల్చుకుంటే ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల నుంచి ఎక్కువ మంది ప్రైవేటు పాఠశాలలకు వెళ్లిపోయారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలో ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి ప్రవేశం పొందిన విద్యార్థులు తర్వాత ప్రైవేటు పాఠశాలల్లో చేరగా ఆ యాజమాన్యాలు వారి సామర్థ్యాలను బట్టి తల్లిదండ్రుల అంగీకారంతో యూకేజీలో ఉంచుతున్నారు. అలాంటి వారందరూ చైల్డ్‌ఇన్‌ఫోలో నమోదు కాకపోవడంతో డ్రాపౌట్స్‌ విద్యార్థుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో పాటు కొన్ని ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు లేక తమ పిల్లలతో వలస వెళ్లి పోవడం కూడా డ్రాపౌట్‌లు పెరుగుతున్నట్లు ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్నాయి. దీంతో పాటు కొవిడ్‌ కారణంగా దూర ప్రాంతాలనుంచి చాలా మంది స్వగ్రామాలకు వచ్చి ఇక్కడ పాఠశాలల్లో పిల్లల్ని చేర్పించి ప్రస్తుతం మళ్లీ ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవడం వల్ల కూడా డ్రాపౌట్స్‌ పెరిగినట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం వారందరినీ గుర్తించే పనిలో అధికారులు, సిబ్బంది పడ్డారు. చాలా మంది విద్యార్థుల వివరాలు తెలియకపోవడంతో తలలు పట్టుకుంటున్నారు. 


వివరాలు సేకరిస్తున్నాం : 

బడిబయట ఉన్న విద్యార్థులందరినీ గుర్తించే ప్రక్రియ జరుగుతోంది. గ్రామస్థాయిలో ఎడ్యుకేషనల్‌ వెల్ఫేర్‌ అసిస్టెంట్‌, సీఆర్పీ, వాలంటీర్‌లతో ఏర్పాటు చేసిన బృందాలు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నాయి. ఎక్కువగా తరగతి మారే క్రమంలో నమోదు కానివి ఉన్నట్లు తెలుస్తోంది. సర్వే ప్రక్రియ పూర్తి చేసి, త్వరలోనే నివేదిక తయారు చేయడంతోపాటు గుర్తించిన పిల్లలందరినీ బడిలో చేర్పించేలా చర్యలు తీసుకుంటున్నాం.

- జి.పగడాలమ్మ, డీఈవో, శ్రీకాకుళం. 


Updated Date - 2022-10-07T05:37:21+05:30 IST