సమస్యల పరిష్కారానికే గ్రామ స్వరాజ్య వేదిక

ABN , First Publish Date - 2022-03-05T06:36:54+05:30 IST

: గ్రామ స్వరాజ్య వేదిక ద్వారా ప్రజలు సమస్యల ను పరిష్కరించనున్నట్లు ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ అన్నారు.

సమస్యల పరిష్కారానికే  గ్రామ స్వరాజ్య వేదిక
ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌


ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌
ముండ్లమూరు, మార్చి 4 :
గ్రామ స్వరాజ్య వేదిక ద్వారా ప్రజలు సమస్యల ను పరిష్కరించనున్నట్లు ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ అన్నారు. శుక్రవారం ఆయన మండలంలోని నూజెండ్లపల్లి, పూరిమెట్ల గ్రామాల్లో గ్రామ స్వరాజ్య వేదిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హాజరైన ప్రజలను ఉద్దే శించి ఆయన మాట్లాడుతూ.. వ్యవస్థలో సమగ్ర మార్పు దిశగా ప్రభుత్వం సాగుతోందన్నారు. ఇందులో భాగంగా సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చినా..,  సిబ్బంది, వలంటీర్ల వ్యవస్థలో కొన్ని తప్పులు దొర్లుతున్నాయన్నారు. ఆ తప్పులు సరిచేసేందుకు గ్రామస్వరాజ్‌ వేదిక ద్వారా ప్రజల్లోకి వస్తున్న ట్లు తెలిపారు. అధికారులు ప్రజల సమస్యలను పరిష్కరించడంలో లోపం లేకుండా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు. మండల స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు సచివాలయాలను సందర్శించినట్లయితే సమస్యలు త్వరిత గతిన పరిష్కారం అవుతాయన్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందించడంతో పాటు నవరత్నాల పథకాల్లో భాగంగా ఇప్పటికే 90 శాతం మేర నెరవేర్చినట్లు తెలిపారు. ప్రజలు ప్రభుత్వం అందిస్తున్న ప్రతి పథకాన్ని సద్వినియోగ పరుచుకొని అభివృద్ధి చెందాలన్నారు.  నాలుగు నెలలకొక సారి గ్రామ స్వరాజ్య వేదిక గ్రామాలకు వచ్చి మొదటి సారి వచ్చిన అర్జీల్లో ఎంత వరకు పరిష్కరించారో ప్రజల సమక్షంలోనే చర్చిస్తామన్నారు. అనంతరం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.
పూరిమెట్లలో రైతు ఆగ్రహం
పూరిమెట్ల గ్రామస్వరాజ్య వేదిక వద్ద పల్లె వెంకటేశ్వరరెడ్డి అనే రైతు తన రెండు ఎకరాల్లో వైట్‌బర్లి పొగాకు సాగు చేస్తే లక్ష రూపాయల పెట్టుబడి అయిందని పేర్కొన్నారు. ధర చూస్తే అంతంత మాత్రంగానే ఉందని, వైసీపీ ప్రభుత్వంలో ఎరువుల ధరలు పూర్తిగా పెరిగాయని దీంతో రైతులకు ఖర్చు పెరుగుతోందన్నారు. ‘చంద్రబాబు నాయుడు ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారో’ అని ఎదురు చూస్తున్నామని సభలో మాట్లాడడంతో ఆ సమావేశానికి వచ్చిన నాయకులు, అధికారులు, ఇతర గ్రామాల ప్రజలు ఒక్కసారిగా కంగుతిన్నారు.  అనంతరం పోలీసులు సర్ధిచెప్పి పంపించారు. అనంతరం ఎమ్మెల్యే వేణుగోపాల్‌ను పూరిమెట్ల, నూజెండ్లపల్లి సర్పంచ్‌లు ఒగులూరి రామాంజీ, చొప్పరపు వెంకటేశ్వర్లు తదితరులు ఘనంగా సన్మానించారు.  కార్యక్రమంలో ఎంపీపీ సుంకర సునీత, జెడ్పీటీసీ తాతపూడి రత్నంరాజు, విద్యుత్‌ ఏడీఈ కే పిచ్చయ్య, ఎంపీడీవో బీ చంద్రశేఖరరావు, తహసీల్దార్‌ పీ పార్వతి, ఏపీవో కే కొండయ్య, ఏపీఎం సైమన్‌, ట్రాన్స్‌కో ఏఈ భూరాజు, ఆర్‌డబ్ల్యుఎస్‌ ఏఈ మధు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-03-05T06:36:54+05:30 IST