లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం
ABN , First Publish Date - 2022-08-14T05:57:10+05:30 IST
లోక్అదాలత్ ద్వారా సత్వర న్యాయం అందించేలా చర్యలు తీసుకున్నట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.భారతి పేర్కొన్నారు.
లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం
జిల్లావ్యాప్తంగా 25 బెంచ్ల ఏర్పాటు
జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారతి వెల్లడి
6,900 కేసులు పరిష్కారం
ఒంగోలు (కలెక్టరేట్), ఆగస్టు 13 : లోక్అదాలత్ ద్వారా సత్వర న్యాయం అందించేలా చర్యలు తీసుకున్నట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.భారతి పేర్కొన్నారు. ఒంగోలులోని జిల్లా కోర్టు ప్రాంగణంలో శనివారం జాతీయ లోక్అదాలత్ను ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో సుమారు 58వేల కేసులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. దాదాపు 10వేల కేసులను గుర్తించి వాటిని లోక్ అదాలత్ ద్వారా పరిష్కారానికి నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 27 బెంచ్లు ఏర్పాటు చేశామన్నారు. ఒంగోలులో పది, మిగిలినచోట్ల 17 బెంచ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాత్రి ఏడు గంటల వరకు కేసుల పరిష్కారం చేశారని చెప్పారు. లోక్ అదాలత్లో అప్పీలుకు అవకాశం లేని అంతిమతీర్పును పొందవచ్చని పేర్కొన్నారు. అదనపు జిల్లా జడ్జిలు ఆర్.శివకుమార్, ఎం.సోమశేఖర్, డి.అమ్మనరాజు, సీనియర్ సివిల్ న్యాయమూర్తులు కె.సత్యకుమారి, ఎస్.విజయలక్ష్మి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.శ్యాంబాబు, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గోకనకొండ శ్రీనివాసరావు పాల్గొన్నారు. శనివారం నిర్వహించిన లోక్ అదాలత్లో జిల్లావ్యాప్తంగా 6,900 కేసులు పరిష్కారమయ్యాయి. ఇందులో సివిల్ కేసులు 350, క్రిమినల్ కేసులు 6,550 ఉన్నాయి. ఈ సందర్భంగా కక్షిదారులకు సుమారు రూ.2.50కోట్లు పరిహారం రూపంలో అందజేశామని న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి శ్యాంబాబు తెలిపారు.