వైభవంగా సీతారామలక్ష్మణ ప్రతిష్ఠ మహోత్సవం
ABN , First Publish Date - 2022-08-14T07:47:06+05:30 IST
తర్లుపాడు పంచాయతీలోని నాయుడపల్లెలో సీతాలాంబ, సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి పోలేరమ్మ, పోతురాజు సాక్షిగణపతి, నాగేంద్రస్వామి విగ్రహాలు, ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవం వైభవం గా నిర్వహించారు.

విశేషంగా హాజరైన భక్తులు
భక్తులకు భారీ అన్నదానం
తర్లుపాడు, ఆగస్టు 13: తర్లుపాడు పంచాయతీలోని నాయుడపల్లెలో సీతాలాంబ, సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి పోలేరమ్మ, పోతురాజు సాక్షిగణపతి, నాగేంద్రస్వామి విగ్రహాలు, ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవం వైభవం గా నిర్వహించారు. వేదపండితులు బ్రహ్మశ్రీ కందుకూరు ప్రసాద్శర్మ ఆధ్వర్యంలో ఉదయం 10.24ని. లకు ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. స్వామివారికి వేద పారాయణం, వాస్తు పూజ, రత్ననాస్యములు, వీర్యవాస్య ములు, ప్రాణప్రతిష్ఠ, పూర్ణహుతి తదితర కార్యక్రమాలు నిర్వహించారు. నూతనంగా ప్రతిష్ఠించిన రామలక్ష్మణ విగ్రహాలకు కల్యాణం నిర్వహించారు. ప్రతిష్ఠా కార్యక్రమానికి మార్కాపురం శాసనసభ్యులు కుందూరు నాగార్జునరెడ్డి, ఎంపీపీ సూరెడ్డి భూలక్ష్మీ, సర్పంచ్ పల్లెపోగు వరాలు తదితరులు హాజరయ్యారు. ప్రతిష్ఠ మహోత్సవం తిలకించేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా భారీస్థాయిలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
కమనీయం చెన్నుడి కల్యాణం
మార్కాపురం(వన్టౌన్) : మార్కాపురంలో వెలసిన శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయంలో చెన్నకేశవ స్వామికి శనివారం శాంతి కల్యాణం కనులపండువగా నిర్వహిం చారు. ప్రధానార్చ కులు శ్రీపతి అప్పనాచార్యులు శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవస్వామి ఉత్సవమూర్తులను శోభయమానంగా అలకరించి కల్యాణ ఘట్టాలు నిర్వహించారు. ఈవో జి.శ్రీనివాసులరెడ్డి, కమిటీ చైర్మన్ పి.కేశవరావు ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు.
నెమిలిగుండ్లకుపోటెత్తిన భక్తులు
రాచర్ల : మండలంలోని జెపుల్లలచెరువు గ్రామ సమీపాన నల్లమల అటవీ ప్రాంతంలో వెలసిన నెమలిగుండ్ల రంగనాయకస్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. నెమలిగుండానికి భారీస్థాయిలో వరదనీరు వస్తుండడంతో భక్తులు గుండంలో స్నానం ఆచరించి రంగనాయకస్వామిని దర్శించుకున్నారు. వచ్చిన భక్తులకు సత్రాలలో అన్నదానం నిర్వహించారు.