సరస్వతీ నమస్తుభ్యం!
ABN , First Publish Date - 2022-10-02T04:39:44+05:30 IST
అమ్మవారిని మనం అనేక రూపాలలో పూజిస్తుంటాం. ముఖ్యంగా దసరా నవరాత్రుల్లో తొమ్మిది రకాల అలంకారాలను చేసి అమ్మవారిని ఆరాధించటం ఆనవాయితీ. అయితే వాటిల్లో అతి ముఖ్యమైన అలంకారంగా పండితులు, విద్యార్థులు సైతం భావించి పూజించేది సరస్వతిదేవి అలంకారం.
నేడు సప్తమి,
మూలానక్షత్రం
సరస్వతీపూజకు ప్రత్యేకం
అన్ని దేవాలయాలలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ
ఒంగోలు(కల్చరల్), అక్టోబరు 1: అమ్మవారిని మనం అనేక రూపాలలో పూజిస్తుంటాం. ముఖ్యంగా దసరా నవరాత్రుల్లో తొమ్మిది రకాల అలంకారాలను చేసి అమ్మవారిని ఆరాధించటం ఆనవాయితీ. అయితే వాటిల్లో అతి ముఖ్యమైన అలంకారంగా పండితులు, విద్యార్థులు సైతం భావించి పూజించేది సరస్వతిదేవి అలంకారం. దేవతామూర్తులలో చదువులతల్లిగా పూజింపబడుతూ, జ్ఞానాన్ని ప్రసాదించే దేవతగా ఆరాధించబడే సరస్వతీదేవి సాక్షాత్తు ఈ సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని భార్య. అమ్మవారు హంసవాహనంపై తెల్లని వస్ర్తాలతో, చేతిలో జ్ఞానానికి ప్రతిరూపమైన పుస్తకము, వీణ మొదలైన వాటితో మనకు దర్శనమిస్తుంది. ఆశ్వీయుజమాసం శుక్లపక్షం సప్తమి, మూలానక్షత్రం కలిసిన రోజు అమ్మవారి జన్మదినం సందర్భంగా ఆ రోజు పలు దేవాలయాల్లో సరస్వతీదేవి అలంకారం నిర్వహించటమే కాకుండా, అనేక పాఠశాలల్లోనా విద్యార్థులతో అమ్మవరి పూజను నిర్వహింపజేస్తారు. రుగ్వేదంలోను, దేవీభాగవంతంలోను, బ్రహ్మ వైవర్త పురాణంలోను, పద్మపురాణంలోను సరస్వతి దేవి గురించి వివిధ కథలు మనకు కనిపిస్తాయి. సరస్వతీదేవిని ఆద్యంత రహిత శక్తి స్వరూపిణిగా వివిధ స్తోత్రాలతో స్తుతించటం ఆనవాయితీ. సృష్టికార్యంలో తనకు తోడుగా ఉండటానికి బ్రహ్మదేవుడే సరస్వతిని సృష్టించి ఆమెను తన నాలుకపై ధరించాడని కొన్ని పురాణాలు చెబుతాయి. వాక్, బుద్ధి, వివేకం, విద్య, కళలు, విజ్ఞానం ఇలా వీటన్నింటికి అధిదేవతగా సరస్వతీ దేవిని పూజిస్తారు.
జ్ఞాన ప్రదాత సరస్వతి
పురాణగాధలను చూసినపుడు మనకు అనేకమంది మహర్షులు సైతం సరస్వతీదేవిని ఆరాధించి జ్ఞానాన్ని పొందారు. వ్యాసుడు నూరు సంవత్సరాల పాటు పుష్కరతీర్థంలో ఉండి అమ్మవారి గురించి తపస్సు చేసి ఆమె వరంతోనే సత్కవీంద్రుడయ్యాడు. ఆ జ్ఞానంతోనే ఆయన వేదాలను విభజించటం, భారతాన్ని రచించటం చేశాడు. అదేవిధంగా దేవతలకు గురువైన బృహస్పతి సైతం సరస్వతీదేవి గురించి తపస్సు చేసి శబ్దశాస్త్రంలో జ్ఞానాన్ని పొందాడు. ఇక యాజ్ఞవల్క మహర్షి సైతం సూర్యభగవానుడి సూచనతో సరస్వతీ స్తోత్రాన్ని నిత్యం పఠించి వేద వేదాంగాలను పొందాడు.
విద్యార్థులకు బుద్ధి ప్రదాత
బుద్ధి అంటే జ్ఞానంతో కూడిన ఆలోచన. అటువంటి సద్భుద్ధిని విద్యార్థులకు ప్రసాదించేది సరస్వతి అమ్మవారు. అందుకే గతంలో ప్రతి రోజు పాఠశాల ప్రారంభంలో ‘సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా’ అనే శ్లోకాన్ని తప్పనిసరిగా విద్యార్థులతో చదివించేవారు. ఇక మూలా నక్షత్రం రోజున అమ్మవారు అత్యంత శక్తి ప్రదాయినిగా ఉంటుందని, భక్తిశ్రద్ధలతో ఆమెను కొలిచిన వారికి విద్య, జ్ఞానం, కళలు మొదలైనవి ప్రసాదిస్తుందని సనాతన హిందూ ధర్మసూత్రం.