ఒంగోలు డెయిరీని పునరుద్ధరించాలి
ABN , First Publish Date - 2022-07-12T05:25:06+05:30 IST
సహకార రంగంలోని ఒంగోలు డెయిరీని పునరుద్ధరించి అటు పాడి రైతులు, ఉద్యోగులకు, ఇటు నిరుద్యోగుల ఉపాధికి ఉపకరించేలా ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. మూతపడిన ఒంగోలు డెయిరీని సోమవారం సాయంత్రం సీఐటీయూ నాయకులు దామా శ్రీనివాసరావు, జి. నర్సయ్య తదితరులతో కలిసి సందర్శించారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు
ఒంగోలు, జూలై 11 (ఆంధ్రజ్యోతి) : సహకార రంగంలోని ఒంగోలు డెయిరీని పునరుద్ధరించి అటు పాడి రైతులు, ఉద్యోగులకు, ఇటు నిరుద్యోగుల ఉపాధికి ఉపకరించేలా ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. మూతపడిన ఒంగోలు డెయిరీని సోమవారం సాయంత్రం సీఐటీయూ నాయకులు దామా శ్రీనివాసరావు, జి. నర్సయ్య తదితరులతో కలిసి సందర్శించారు. డెయిరీలో నిరుపయోగంగా ఉన్న యంత్రాలు, ఇతరాలను పరిశీలించడంతో పాటు డెయిరీ ఉద్యోగుల సంఘ నాయకులు బ్రహ్మయ్య, నారాయణ తదితరులను పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఒంగోలు డెయిరీకి ఈ పరిస్థితి రావడానికి గత ప్రభుత్వ బాధ్యత ఎంతో ఉందో, ప్రస్తుత ప్రభుత్వ బాధ్యత కూడా అంత ఉందన్నారు. డెయిరీకి సుమారు రూ. వెయ్యి నుంచి 12వందల కోట్ల ఆస్తి ఉండగా దానిని ఇలా ఇటు రైతులకు, అటు అమూల్కు పనికిరాకుండా చేశారని, జాతి సంపదను ఇలా చేయడం నేరమన్నారు. సహకార రంగంలోని డెయిరీని మూతేసి గుజరాత్కు చెందిన అమూల్కు కట్టబెట్టినా అది కూడా విఫలం చెందిందన్నారు. అమూల్ వల్లడెయిరీకి ఒరిగిందేమి లేదని ఆయన విమర్శించారు. అమూల్ రాక ముందు ఒంగోలు డెయిరీకి రోజుకు 20వేల లీటర్ల పాలు వస్తుంటే ప్రస్తుతం అమూల్ సేకరణ 10వేలు మించి ఉండటం లేదన్నారు. డెయిరీ ఉద్యోగులకు కూడా ఫెడరేషన్ మోసం చేసిందన్నారు. ఇలాంటి సంస్థలను మూతవేసేటప్పుడు రైతులు, ఉద్యోగుల బకాయిలు చె ల్లింపు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అయితే ప్రభుత్వం నుంచి తెచ్చిన డబ్బును కూడా ఫెడరేషన్ ఉద్యోగులకు చెల్లించకుండా ఇబ్బందులు పెట్టిందని, వారికి ప్యాకేజీ ఇచ్చారు తప్ప వేతన బకాయిలు చెల్లించలేదని అన్నారు. తక్షణం సహకార సంస్థ ద్వారా డెయిరీని నడిపాలని ఆయన డిమాండ్ చేశారు.