దెబ్బతిన్న పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే స్వామి
ABN , First Publish Date - 2022-12-12T23:27:39+05:30 IST
తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పొగాకు, శనగ పైర్లను ఎమ్మెల్యే డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి, టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి దామచర్ల సత్యన్నారాయణ సోమవారం పరిశీలించారు. కొండపి మండలంలోని కె.ఉప్పలపాడు, జరుగుమల్లి మండలంలోని చిర్రికూరపాడు, నర్శింగోలు, దావగూడూరు తదితర గ్రామాల్లో వారు పర్యటించారు.
జరుగుమల్లి (కొండపి), డిసెంబరు 12 : తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పొగాకు, శనగ పైర్లను ఎమ్మెల్యే డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి, టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి దామచర్ల సత్యన్నారాయణ సోమవారం పరిశీలించారు. కొండపి మండలంలోని కె.ఉప్పలపాడు, జరుగుమల్లి మండలంలోని చిర్రికూరపాడు, నర్శింగోలు, దావగూడూరు తదితర గ్రామాల్లో వారు పర్యటించారు. అధిక వర్షం కారణంగా పొగాకు మొక్కలు ఉరకలెత్తిపోయాయని, శనగ పైరు నీటిలో నాని కుళ్లిపోయిందని రైతులు ఈసందర్భంగా వారికి తెలిపారు. వేలాది రూపాయలు నష్టపోయామని వాపోయారు. అనంతరం ఎమ్మెల్యే స్వామి, సత్య విలేకరులతో మాట్లాడుతూ కొండపి, జరుగుమల్లి, టంగుటూరు మండలాల్లో తుఫాన్ కారణంగా కురిసిన అధిక వర్షాలతో వేలాది ఎకరాల్లో పొగాకు, శనగ, మిరప, మినుము, బొబ్బర్లు సాగు చేసిన రైతులు నష్టపోయారన్నారు. పొగాకు పంటకు ఎకరానికి రూ.50 వేలు, శనగకు ఎకరానికి రూ.25 వేలు, మినుము రైతులు ఎకరాకు రూ.30 వేలు రైతులు ఇప్పటి వరకూ పెట్టుబడి పెట్టారని వారు వివరించారు. కౌలు రైతులు అదనంగా ఎకరానికి రూ.15 వేలు కౌలు చెల్లించారన్నారు. మిర్చి సాగు చేసిన వారు ఇప్పటికే ఎకరాకు దాదాపు రూ.లక్ష వెచ్చించారని తెలిపారు. ప్రస్తుతం రైతులంతా ఆందోళనలో ఉన్నారన్నారు. ప్రభుత్వం వెంటనే నష్టం అంచనాలు వేయించి తక్షణ సాయం, నష్ట పరిహారం అందించాలని స్వామి, సత్య డిమాండ్ చేశారు. వారి వెంట టీడీపీ జరుగుమల్లి మండల అధ్యక్షుడు పోకూరి రవీంద్రబాబు, సీనియర్ నాయకుడు పోటు శ్రీనివాసమురళి తదితరులు ఉన్నారు.
నేడు సోమిరెడ్డి పర్యటన
టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి మంగళవారం కొండపి, జరుగుమల్లి, టంగుటూరు, సింగరాయకొండ మండలాల్లో పర్యటించనున్నారు. తుఫాన్ కారణంగా నష్టపోయిన పంటలను ఆయన పరిశీలిస్తారని ఎమ్మెల్యే స్వామి తెలిపారు.
టంగుటూరులో..
టంగుటూరు : వర్షాలకు దెబ్బతిన్న పొగాకు తోటలను సోమవారం ఎమ్మెల్యే డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య పరిశీలించారు. వీరు మండలంలోని తూర్పునాయుడుపాలెం, జయవరం గ్రామాల్లో పర్యటించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ దెబ్బతిన్న రైతులందరికీ నష్టపరిహారంఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.