పారిశుధ్య కార్మికుల ఆకలికేకలు
ABN , First Publish Date - 2022-10-14T05:17:00+05:30 IST
గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే పారిశుధ్య కార్మికుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. నెలల తరబడి వేతలు అందక వారి కుటుంబాలు ఇబ్బందిపడుతున్నాయి ఎండనక వాననక.... నిరంతరం గ్రామాల్లో చెత్తను తొలగిస్తూ, కాలువలను శుభ్రం చేసే కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. జిల్లావ్యాప్తంగా సుమారు 1,900 మంది క్లాప్ మిత్రులుగా పనిచేస్తున్నారు.
నెలల తరబడి వేతనాలు రాక ఆందోళన
గ్రామాల్లో పనిచేసే వారి పరిస్థితి దయనీయం
రూ.6కోట్లకుపైగానే బకాయిలు
అధికారులను కలిసి విన్నవించిన ఫలితం శూన్యం
ఒంగోలు(కలెక్టరేట్), అక్టోబరు 13: గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే పారిశుధ్య కార్మికుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. నెలల తరబడి వేతలు అందక వారి కుటుంబాలు ఇబ్బందిపడుతున్నాయి ఎండనక వాననక.... నిరంతరం గ్రామాల్లో చెత్తను తొలగిస్తూ, కాలువలను శుభ్రం చేసే కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. జిల్లావ్యాప్తంగా సుమారు 1,900 మంది క్లాప్ మిత్రులుగా పనిచేస్తున్నారు. స్వచ్ఛత కార్యక్రమాల్లో భాగంగా ప్రభుత్వం గతేడాది అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా ప్రారంభించిన జగనన్న స్వచ్ఛసంకల్పలో భాగంగా వారిని నియమించింది. జిల్లాలోని 729 గ్రామపంచాయతీల్లో ఈ కార్మికులు పనిచేస్తున్నారు. నిత్యం కార్మికులు ఇంటింటికి తిరుగుతూ చెత్త సేకరించి గ్రామ శివార్లలో ఉన్న చెత్త సంపద కేంద్రాలకు తరలిస్తుంటారు. అయితే వీరికి ఇచ్చే వేతనం తక్కువే. అది కూడా సకాలంలో చెల్లించని పరిస్థితి ఏర్పడింది. ఒక్కొక్క కార్మికునికి నెలకు రూ.6వేలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం గత ఏడేనిమిది నెలల నుంచి రూపాయి ఇవ్వలేదు. అలా జిల్లావ్యాప్తంగా సుమారు రూ.6కోట్ల వరకు బకాయిలు ఉన్నాయి. కాగా ఆ వేతన బకాయిల కోసం కార్మికులు ఇప్పుడు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవల కురుస్తున్న వర్షాలతో గ్రామాల్లో పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. అంతోఇంతో వారి సేవలతోనే పారిశుధ్యం మెరుగుపడే పరిస్థితి. అయినా ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ కార్మికులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కొంతమంది కార్మికులకు వేతనాలు రాక కుటుంబపోషణ కష్టతరంగా మారింది. విధి లేని పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పనుల వైపు మొగ్గుచూపుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పెండింగ్లో ఉన్న వేతనాలు మంజూరు చేయాలని కార్మికులు వేడుకుంటున్నారు.