అమూల్ బిల్లు రాక గొల్లు
ABN , First Publish Date - 2022-08-12T05:00:06+05:30 IST
అమూల్ కేంద్రాలకు పాలుపోసిన వారు నిలదీస్తున్నారని కేంద్ర నిర్వాహకురాలు ఎంపీడీవోతో వాగ్వాదానికి దిగారు. ముండ్లమూరులో గురువారం విద్యావనరుల కేంద్రంలో ఎంపీడీవో రామాంజనేయులు అధ్యక్షతన జగనన్న పాలవెల్లువపై సచివాలయ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, వీవోఏలతో సమావేశం జరిగింది. ఎంపీడీవో రామాంజనేయులు మాట్లాడుతూ జగనన్న పాలవెల్లువలో భాగంగా అమూల్ కేంద్రాలకు పాలు పెంచే విధంగా కృషి చేయాలని సూపర్వైజర్లు, కిందిస్థాయి అధికారులు, కేంద్రం నిర్వాహకులను కోరారు.
కేంద్రాలకు పాలు పోసిన వారు నిలదీత
ఎంపీడీవోతో నిర్వాహకుల వాగ్వాదం
ముండ్లమూరు, ఆగస్టు 11: అమూల్ కేంద్రాలకు పాలుపోసిన వారు నిలదీస్తున్నారని కేంద్ర నిర్వాహకురాలు ఎంపీడీవోతో వాగ్వాదానికి దిగారు. ముండ్లమూరులో గురువారం విద్యావనరుల కేంద్రంలో ఎంపీడీవో రామాంజనేయులు అధ్యక్షతన జగనన్న పాలవెల్లువపై సచివాలయ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, వీవోఏలతో సమావేశం జరిగింది. ఎంపీడీవో రామాంజనేయులు మాట్లాడుతూ జగనన్న పాలవెల్లువలో భాగంగా అమూల్ కేంద్రాలకు పాలు పెంచే విధంగా కృషి చేయాలని సూపర్వైజర్లు, కిందిస్థాయి అధికారులు, కేంద్రం నిర్వాహకులను కోరారు. మండలంలోని రెడ్డినగర్లో అమూల్ పాలకేంద్రం నిర్వహిస్తున్న కామాక్షి ఒక్కసారిగా లేచి ‘ఎందుకండీ ఈ మీటింగ్లు, పనీపాటా లేకుండా పెడుతున్నారు. మా గ్రామానికి చెందిన సావిత్రి అనే మహిళ మార్చి 20 నుంచి మే 20 వరకు పాలు పోసింది. రూ.39,541 బిల్లు ఆమెకు చెల్లించాల్సి ఉంది. ఆరు నెలలైనా పైసా కూడా ఇవ్వలేదు. సంబంధిత అధికారులను ఎవరినా అడిగినా రేపో..ఎల్లుండో అంటూ తప్పించుకోవడం తప్ప డబ్బులు చెల్లించడం లేదు’ అని ఎంపీడీవోపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆవేశం వద్దమ్మా, అందరికీ సమస్యలు ఉంటాయి, మీ బాధ అర్థమైంది. అమూల్ కేంద్రానికి మాత్రం పాలు పోయించండి అని చెప్పడంతో కిందిస్థాయి సిబ్బంది, వీవోఏలు ఇదెక్కడి గోల అంటూ ఒక్కసారిగా ఎంపీడీవోపై విరుచుకుపడ్డారు. పశువైద్యాధికారి విజయలక్ష్మి, ఈవోఆర్డీ ఓబులేసు, ఏపీఎం హనుమంతరావు, ఎస్బీఎల్సీవో మాలకొండయ్య పాల్గొన్నారు.
రెండుసార్లు స్పందనలో ఫిర్యాదు చేశాం
- కామాక్షి, అమూల్ పాలకేంద్రం నిర్వాహకురాలు
అమూల్ కేంద్రానికి ఆరునెలలు పాలు పోశాం. ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. దీనిపై రెండుసార్లు స్పందనలో ఫిర్యాదు చేశా. నేటికీ అధికారులు స్పందించలేదు. పైపెచ్చు అమూల్కంటే బయట డెయిరీలలో లీటరకు రూ.10 అదనంగా ఇస్తున్నారు. ప్రైవేట్ డెయిరీలవైపే పాలు పోసేవారు మొగ్గుచూపుతున్నారు. జగనన్నపై అభిమానంతో భారమైనా అమూల్ కేంద్రాలకు పాలు పోసేందుకు సహకరిస్తున్నాం.