ఈతకు వెళ్లి యువకుడి మృతి
ABN , First Publish Date - 2022-10-07T06:30:32+05:30 IST
స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లిన యువకుడు సాగర్ కాలువలో పడి దుర్మరణం పాలైన ఘటన మండల కేంద్రం త్రిపురాతకంలో మంగళవారం రాత్రి జరిగింది.
త్రిపురాంతకం/దొనకొండ, అక్టోబరు 6: స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లిన యువకుడు సాగర్ కాలువలో పడి దుర్మరణం పాలైన ఘటన మండల కేంద్రం త్రిపురాతకంలో మంగళవారం రాత్రి జరిగింది. పోలీసులు బంధువులు తెలిపిన వివరాల ప్రకారం గుంటూరు జిల్లా చేబ్రోలుకు చెందిన ఉదయగిరి భరత్ త్రిపురాంతకంలోని తన బంధువుల ఇంటివద్ద ప్రత్యేక ప్రార్ధలనల్లో పాల్గొనేందుకు వచ్చాడు. కాగా తన స్నేహితులతో కలిసి సాగర్ ప్రధాన కాలువ వద్దకు వెళ్లాడు. స్నేహితులు ఈత కొడుతుండగా భరత్ తన సెల్ఫోనుతో ఫోటోలు తీస్తున్నాడు. అదే సమయంలో కాలు జారి కాలువలో పడిపోయాడు. అనంతరం తన స్నేహితులు, బంధువులు ఎంత వెతికినా కనిపించలేదు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం దొనకొండ మండలం లక్ష్మీపురం లాకుల వద్ద భరత్ మృతదేహాన్ని గుర్తించారు. భరత్ ఇటీవలే ఎంబీబీఎస్ పూర్తిచేసి ఉన్నత చదువులకోసం విదేశాలకు వెళ్లే ప్రయత్నంలో ఉన్నట్లు బంధువులు తెలిపారు.