ఒక్క పిచ్చిమొక్క పీకితే ఒట్టు
ABN , First Publish Date - 2022-08-20T04:53:57+05:30 IST
సాగర్ కాలువలు అస్తవ్యస్తంగా మారాయి. ఎక్కడ చూసినా కాలువ కట్టపై చిల్లచెట్లు దట్టంగా పెరిగాయి. మేజర్లు, మైనర్లకు గండ్లు పడి అధ్వానంగా మారాయి. మూడేళ్ల నుంచి కనీస మరమ్మతులకూ నోచుకోలేదు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్క రూ పాయి కూడా విడుదల చేయలేదు.
అస్తవ్యస్తంగా సాగర్ కాలువలు
గత మూడేళ్లలో రూపాయి కూడా విదల్చని వైసీపీ ప్రభుత్వం
తీవ్రమైన సిబ్బంది కొరత
సాగునీటి పంపిణీపై అనుమానం వ్యక్తం చేస్తున్న రైతులు
దర్శి, ఆగస్టు 19 : సాగర్ కాలువలు అస్తవ్యస్తంగా మారాయి. ఎక్కడ చూసినా కాలువ కట్టపై చిల్లచెట్లు దట్టంగా పెరిగాయి. మేజర్లు, మైనర్లకు గండ్లు పడి అధ్వానంగా మారాయి. మూడేళ్ల నుంచి కనీస మరమ్మతులకూ నోచుకోలేదు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్క రూ పాయి కూడా విడుదల చేయలేదు. దీంతో కనీసం చిల్లకంప కూడా కొట్టిన దాఖలాలు లేవు. గతంలో మేజర్లు, మైనర్లపై పెరిగిన చిల్లచెట్లు, గడ్డి మొక్కలను లస్కర్లు తొలగించి బాగు చేసేవారు. ప్రస్తుతం అధికశాతం సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సాగర్ ఆయకట్టు భూములకు సాగునీరు సక్రమంగా అందే పరిస్థితి కనిపించటం లేదు.
దర్శి ఎన్ఎ్సపీ డివిజన్లో మొత్తం 55 మేజర్లు, 95 మైనర్లు ఉన్నాయి. దాదాపు అన్ని కాలువల పరిస్థితి అధ్వానంగా మారింది. వీటి కింద లక్ష ఎకరాల ఆయకట్టు భూమి ఉంది. అందులో 60 వేల ఎకరాలలో వరిసాగు చేస్తారు. మిగిలిన 40 వేల ఎకరాల్లో ఆరుతడి పంటలు వేస్తారు. అదేవిధంగా చీమకుర్తి డివిజన్లోని దర్శి-2 సబ్ డివిజన్లో దర్శి మండలానికి చెందిన 25వేల ఎకరాల ఆయకట్టు భూమి ఉంది. అందులో 20వేల ఎకరాల్లో వరిసాగు చేస్తారు. మిగిలిన 5వేల ఎకరాల్లో ఆరుతడి పంటలు వేస్తారు. ఈ ఏడాది వరిసాగుకు నీరు సరఫరా చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సాగర్ కాలువలకు నీరు విడుదలైంది. మేజర్లు, మైనర్లు అధ్వానంగా మారటంతో కాలువల్లో నీరు ముందుకు సాగటం లేదు. అన్నీ ప్రాంతాల పరిఽధలోని ఆయకట్టు భూములకు సక్రమంగా నీరు అందే సూచనలు కనిపించటం లేదు.
ఖాళీగా అధికశాతం పోస్టులు
దర్శి ఎన్ఎ్సపీ డివిజన్ పరిధిలో అధికశాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏళ్ల తరబడి ఈ పోస్టులు భర్తీకి నోచుకోలేదు. దర్శి డివిజన్ పరిధిలో 103 మంది లస్కర్లు ఉండాల్సి ఉండగా కేవలం 19 మంది మాత్రమే ఉన్నారు. 24 మంది వర్క్ ఇన్స్పెక్టర్ల పోస్టులు ఉండగా కేవలం ఏడుగురు మాత్రమే ఉన్నారు. 16 మందికిగాను 12 మంది ఏఈలు ఉన్నారు. అదేవిదంగా చీమకుర్తి డివిజన్పరిధిలోని దర్శి-2 సబ్ డివిజన్లో 36 మంది లస్కర్లు ఉండాల్సి ఉండగా కేవలం నల్గురు మాత్రమే ఉన్నారు. మరో ముగ్గురు ఎన్ఎంఆర్ కింద పనిచేస్తున్నారు. ఐదుగురు వర్క్ ఇన్స్పెక్టర్లు ఉండాల్సి ఉండగా ముగ్గురు ఉన్నారు. నల్గురు ఏఈలకుగాను కేవలం ఇరువురు మాత్రమే ఉన్నారు. అన్ని ప్రాంతాలకు నీరు పంపిణీ చేసేందుకు లస్కర్లు, వర్క్ ఇన్స్పెక్టర్లు కీలకంగా పనిచేస్తారు. అక్రమంగా నీరు వాడకుండా దుర్వినియోగం కాకుండా కాలువలపై సిబ్బంది పర్యటించాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో అధికశాతం సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉండటంతో సాగునీటి పంపిణీ ఏటా అస్తవ్యస్తంగా మారింది. ఈ ఏడాది కూడా సిబ్బంది నియామకం జరగకపోవటంతో సాగునీటి పంపిణీ అధ్వానంగా మారే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.