Prakasam: అతనికి పెళ్లయి పిల్లలు.. మెడికల్ షాప్‌లో పనిచేస్తూ చేసిన ఒక్క తప్పు వల్ల..

ABN , First Publish Date - 2022-10-07T23:22:18+05:30 IST

మంత్రాలయం పుణ్యక్షేత్రంలో ప్రేయసి ప్రియుల ఆత్మహత్యాయత్నం చేశారు. ఇందులో ప్రియుడు మృతి చెందగా ప్రియురాలి పరిస్థితి..

Prakasam: అతనికి పెళ్లయి పిల్లలు.. మెడికల్ షాప్‌లో పనిచేస్తూ చేసిన ఒక్క తప్పు వల్ల..

మంత్రాలయం: మంత్రాలయం పుణ్యక్షేత్రంలో ప్రేయసి ప్రియుల ఆత్మహత్యాయత్నం చేశారు. ఇందులో ప్రియుడు మృతి చెందగా ప్రియురాలి పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషాద సంఘటన విజయదశమి పండుగ రోజు బుధవారం మంత్రాలయంలో చోటు చేసుకుంది. మంత్రాలయం ఎస్‌ఐ వేణుగోపాల్‌రాజు వివరాల మేరకు.. నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కరేడు గ్రామానికి చెందిన మల్లెబోయిన వేణు (32) సింగరాయకొండలో మెడికల్‌ స్టోర్‌లో పని చేస్తున్నాడు. దర్శి పట్టణానికి చెందిన వివాహిత విష్ణుప్రియ (30)తో వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నాడు. వేణుకు భార్య సాయిప్రత్యూష, కొడుకు ఆదిత్య, కూతురు శ్రావ్య, ఉన్నారు. విష్ణుప్రియకుభర్త, కుమారుడు మహాదార్‌ ఉన్నారు. వీరు వారందర్ని వదిలి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు షిరిడీ, పూరి పుణ్యక్షేత్రాలు తిరిగి బుధవారం తెల్లవారుజామున కారులో మంత్రాలయం వచ్చారు. మంత్రాలయంలో ఓ గదిని అద్దెకు తీసుకునేందుకు ప్రయత్నాలు చేయగా రద్దీ కారణంగా దొరకలేదు. దీంతో కారులోనే ఉండిపోయారు.



ఇదిలా.. ఉంటే విష్ణుప్రియ భర్త తన భార్య అదృశ్యమైందని దర్శి పోలీస్ స్టేషన్‌లో గత నెల 4వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అప్పటికే గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో ఎలాగూ పెళ్లికి పెద్దలు ఒప్పుకోరని భావించి వేణు, విష్ణుప్రియలు చనిపోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో తమ వెంట తెచ్చుకున్న నిద్రమాత్రలు మింగారు. విష్ణుప్రియ కారు బయటకు వచ్చి వాంతులు చేసుకుంటుండగా స్థానిక భక్తులు గమనించారు. కారులో ఉన్న వేణును బయటకు తీసేలోగా మృతి చెందాడు. విష్ణుప్రియ తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. వారి దగ్గర ఉన్న ఆధారాలను బట్టి బంధువులకు సమాచారం ఇచ్చారు. మంత్రాలయం ఎస్‌ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు.

Updated Date - 2022-10-07T23:22:18+05:30 IST