మృతుడి కుటుంబానికి న్యాయం చెయ్యండి
ABN , First Publish Date - 2022-01-29T03:45:44+05:30 IST
నాంచారమ్మపల్లి గ్రామానికి చెందిన మారుబోయిన తిరుపతి యాదవ్ అనుమానాస్పద మృతి కేసులో న్యాయం చెయ్యాలని తెలుగు యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షడు కోన గురవయ్య యాదవ్ పేర్కొన్నారు.
యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు
కావలి రూరల్, జనవరి 28: నాంచారమ్మపల్లి గ్రామానికి చెందిన మారుబోయిన తిరుపతి యాదవ్ అనుమానాస్పద మృతి కేసులో న్యాయం చెయ్యాలని తెలుగు యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షడు కోన గురవయ్య యాదవ్ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం కావలి డీఎస్పీ కార్యాలయానికి మృతుని కుటుంబసభ్యులతో కలసి వెళ్లి డీఎస్పీ ప్రసాద్కు వినతిపత్రం అందజేశారు. గురవయ్య యాదవ్ మాట్లాడుతూ ఉదయగిరి నియోజకవర్గం సీతారామపురం మండలం నాంచారమ్మపల్లి గ్రామానికి చెందిన రైతు తిరుపతయ్య యాదవ్ ఈ నెల 1వ తేదీన అనుమానాస్పదంగా మృతి చెందాడన్నారు. ఆయన మృతి పట్ల అనేక అనుమానాలున్నాయని, గ్రామంలోని పొలాల దారుల విషయంలో అగ్రవర్ణాల వారు అనేక మార్లు బెదిరించారని సూచించారు. ఈ క్రమంలో అటవీ ప్రాంతంలో తిరుపతి యాదవ్ మృతి చెందటం పలు అనుమానాలకు దారితీసిందన్నారు. దీంతో డీఎస్పీ ప్రసాద్ మాట్లాడుతూ పోస్ట్మార్టం రిపోర్టు రావాల్సి ఉందని, విచారించి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మృతుడి కుమారుడు శ్రీనివాసులు, యాదవ మహాసభ సభ్యులు పాల్గొన్నారు.