మరో శ్రీలంకగా రాష్ట్రం
ABN , First Publish Date - 2022-05-21T05:39:42+05:30 IST
అప్పుల ఊబిలో చిక్కుకున్న రాష్ట్రం మరో శ్రీలంకగా మారిందని టీడీపీ నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ మండిపడ్డారు.
అనుభవ రహిత పాలనతో రాష్ట్రం చిన్నాభిన్నం
చంద్రబాబును మళ్లీ సీఎం చేద్దాం
మినీ మహానాడులో అబ్దుల్ అజీజ్ పిలుపు
కొడవలూరు మే 20 : అప్పుల ఊబిలో చిక్కుకున్న రాష్ట్రం మరో శ్రీలంకగా మారిందని టీడీపీ నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ మండిపడ్డారు. శుక్రవారం నార్తురాజూపాలెంలోని పీఎ్సఆర్ కల్యాణ మండపంలో జరిగిన నియోజకవర్గస్థాయి మినీ మహానాడులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ముందుగా మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డితో కలిసి టీడీపీ జెండాను ఆవిష్కరించి, దివంగత ఎన్టీఆర్ చిత్రపట్టానికి నివాళులర్పించారు. ఒక్క అవకాశం అంటూ అధికారంలో వచ్చిన వైఎస్ జగన్ అనుభవ రహిత పాలనతో రాష్ట్ర ప్రజల జీవితాలు చిన్నాభిన్నం చేశారని దుయ్యపట్టారు. తిరిగి రాష్ట్రం గాడిన పెట్టాలంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రి చేసుకునేందుకు నాయకులు, కార్యకర్తలు ఉద్యమంలా పని చేయాలని పిలుపునిచ్చారు.
మా కార్యకర్తల జోలికొస్తే ఖబడ్దార్!
నియోజకవర్గంలో తమ నాయకులు, కార్యకర్తల జోలికి వస్తే ఖబడ్జార్ అని మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి హెచ్చరించారు. రాష్ట్రంలో పిచ్చి తుగ్లక్ పాలన నడుస్తోందని, పెరిగిన ధరలతో ప్రజలు జీవించలేక అల్లాడిపోతున్నారని అన్నారు. పారిశ్రామికంగా, ఆర్థికంగా రాష్ట్రం పూర్తిగా కుంటుపడిందని పేర్కొన్నారు. రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా రానున్న ఎన్నికల్లో టీడీపీని తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు నాయకులు, కార్యకర్తలు సైన్యంలా పని చేయాలని పిలుపునిచ్చారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మారుమూల గ్రామాలను సైతం తాను అభివృద్ధి చేశానని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించి, ఆదుకున్నట్లు తెలిపారు. నేడు కోవూరు నియోజకవర్గం మాఫియాలకు అడ్డాగా మారిందని మండిపడ్డారు. అనంతరం నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల పార్టీ అధ్యక్షులు కోటంరెడ్డి అమరేంద్రరెడ్డి, చెముకుల శ్రీనివాసులు, విరేంద్రబాబు చౌదరి, ఇంతా మల్లారెడ్డి, ఎంవీశేషయ్యలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చెముకుల కృష్ణ చైతన్య, చెక్కామధన్, జీవీఎన్ శేఖర్ రెడ్డి, రాజేంద్రకుమార్, సత్యంరెడ్డి, నాసిన ప్రసాద్ , కరకటి మల్లికార్జున తదితర నాయకులు పాల్గొన్నారు.