జగనన్న స్మార్ట్ సిటీ పనుల అడ్డగింపు
ABN , First Publish Date - 2022-05-23T03:11:59+05:30 IST
జగనన్న స్మార్ట్సిటీ పేరుతో నెల్లూరు అర్బన్ డెవలమెంట్ అథారిటీ(నుడా) వేస్తున్న లేఅవుట్ పనులను ఆదివారం జమ్మలపా
జలదంకి, మే22: జగనన్న స్మార్ట్సిటీ పేరుతో నెల్లూరు అర్బన్ డెవలమెంట్ అథారిటీ(నుడా) వేస్తున్న లేఅవుట్ పనులను ఆదివారం జమ్మలపాలెం గ్రామస్థులు మాజీ సర్పంచు నక్కా మాధవరావుతో కలిసి అడ్డుకున్నారు. గత ప్రభుత్వం హయాంలో టిడ్కో గృహాలు నిర్మిస్తామని ఇక్కడి 97ఎకరాల సీజేఎఫ్ఎస్ భూములను 95 మంది నుంచి సేకరించారు. కావలికి దగ్గరగా ఉండడంతో ఎకరాకు రూ.13 లక్షల పరిహారం ఇచ్చి భూసేకరణ చేశారు. కానీ ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం జగనన్న స్మార్ట్సిటీ పేరుతో లేఅవుట్ సిద్ధం చేస్తున్నది. దీంతో ఆదివారం ఉదయం భూసేకరణ భూముల్లో భాగంగా మామిడితోటను తొలగించేందుకు ప్రయత్నించగా భూములు కోల్పోయిన జమ్మలపాలెం గ్రామస్థులు అడ్డుకున్నారు. గ్రావెల్తోలే ట్రిప్పరును కూడా అడ్డగించారు. విషయం తెలుసుకున్న తహసీల్దారు సీతామహాలక్ష్మి అక్కడకు చేరుకుని గ్రామస్థులతో చర్చించారు. మామిడితోటను పరిశీలించిన తహసీల్దారు ఆర్డీవో శీనానాయక్తో మాట్లాడారు. పనులను అడ్డుకున్న రైతులను ఆర్డీవో కార్యాలయానికి వచ్చి ఆర్డీవోతో మాట్లాడాలని తహసీల్దారు చెప్పారు. భూసేకరణ చేసిన భూముల్లోనే గ్రామసభ నిర్వహించాలని రైతులు డిమాండ్ చేశారు. దీంతో తహసీల్దారు విషయాన్ని ఆర్డీవో దృష్టికి తీసుకువెళతానని చెప్పడంతో గ్రామస్థులు వెనుతిరిగారు. తహసీల్దారు వెంట ఆర్ఐ శ్రీజ, వీఆర్వో రమణయ్య, వీఆర్ఏలు తదితరులు ఉన్నారు.