చెరువులు తవ్వేస్తున్నారు..!
ABN , First Publish Date - 2022-04-06T03:59:47+05:30 IST
అంతా మా ఇష్ణం.. మాకు అడ్డెవరంటూ గ్రామాల్లో పెట్రేగిపోతున్న అధికార పార్టీ నేతలు చెరువులను కుళ్లబొడుస్తున్నారు.
నిబంధనలకు విరుద్ధంగా గ్రావెల్ అక్రమ రవాణా
రేయింబవళ్లు అధికార పార్టీ నేతల దందా
పట్టించుకోని అధికారులు, పాలకులు
కావలి రూరల్, ఏప్రిల్ 5: అంతా మా ఇష్ణం.. మాకు అడ్డెవరంటూ గ్రామాల్లో పెట్రేగిపోతున్న అధికార పార్టీ నేతలు చెరువులను కుళ్లబొడుస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా యంత్రాలతో తవ్వకాలు చేస్తూ రేయింబవళ్లు గ్రావెల్, ఇసుక, మట్టి అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. కావలి పట్టణ, పరిసర ప్రాంతాల్లో వెలుస్తున్న లే అవుట్లకు అర్ధరాత్రి సమయంలో చెరువుల్లోని మట్టి, గ్రావెల్ను అధికారపార్టీ నేతల సహకారంతో యథేచ్ఛగా తరలిస్తున్నారని పలు గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినా సంబంధిత అధికారులు, పాలకులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతోన్నాయి. ఈ క్రమంలో మంగళవారం కావలి మండలం రుద్రకోట చెరువులో అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్నారని గ్రామస్థులు ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారం రోజులుగా అర్ధరాత్రిళ్లు ఎక్స్వేటర్తో నిబంధనలకు విరుద్ధంగా సుమారు 10 అడుగుల లోతు తవ్వకాలు చేపట్టి టిప్పర్లతో అక్రమంగా మట్టి తరలిస్తున్నారని పేర్కొన్నారు. వర్షాకాలంలో మట్టి తరలించిన గుంటల్లో చేరే నీటిలో పడి పలువురు మృత్యువాత పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అక్రమంగా మట్టి తరలిస్తే చర్యలు
రుద్రకోట చెరువులో అక్రమంగా మట్టి తరలిస్తున్నారన్న విషయం తమ దృష్టికి వచ్చింది. పరిశీలించి అనుమతులు లేకుండా మట్టి, గ్రావెల్ తరలిస్తే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం.
- జంపాని కిరణ్, ఇరిగేషన్ ఏఈ