ఉచిత బియ్యం పంపిణీ ఊసేది..?
ABN , First Publish Date - 2022-04-22T04:44:55+05:30 IST
జిల్లాలో కరోనా పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం తెల్లరేషన్ కార్డుదారులందరికీ ఉచిత బియ్యం అందించేందుకు ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం ప్రకటించింది.
జాడలేని కేంద్ర సాయం
రేషన దుకాణాలకే చేరని వైనం
ఇంకా పూర్తికాని మొదటి విడత
లబ్ధిదారుల ఎదురుచూపు
కరోనా లాక్డౌన్ కారణంగా తెల్లరేషన్ కార్డుదారులకు గత ఆరునెలలుగా కేంద్రం ఇస్తున్న ఉచిత బియ్యం 21వ తేదీ దాటినా పంపిణీ ఊసేలేదు. రాష్ట్ర ప్రభుత్వ మొదటి విడత రేషన్ పంపిణీ కొనసాగుతూనే ఉంది. కేంద్రం తరఫున ఉచిత బియ్యం ఇంకా రేషన్ దుకాణాలకే చేరనేలేదు. దీంతో ఈ నెలలో ఇస్తారో.. లేదోనని లబ్ధిదారుల్లో సందేహం కలుగుతోంది.
సంగం/ ఉదయగిరి, ఏప్రిల్ 21: జిల్లాలో కరోనా పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం తెల్లరేషన్ కార్డుదారులందరికీ ఉచిత బియ్యం అందించేందుకు ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం ప్రకటించింది. రేషనకార్డులో పేరు నమోదై ఉన్న ప్రతి ఒక్కరికి ఐదు కిలోల బియ్యం ఉచితంగా పంపిణీ చేసేందుకు శ్రీకారం చుట్టింది. గత కొన్నినెలలుగా పంపిణీ చేస్తోంది. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా మొదట్లో ఉచితంగానే రేషన పంపిణీ చేసింది. ఆ తరువాత ఉచితం ఎత్తేసి కిలో రూపాయి చొప్పున పంపిణీ చేపట్టింది. దీంతో ప్రతి నెల 1 నుంచి 15వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే కిలో రూపాయి బియ్యాన్ని ఎండీయూ వాహనంలో డోర్ డెలివరీ చేస్తున్నారు. 18వ తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఉచిత బియ్యాన్ని దుకాణంలోనే డీలరు ద్వారా పంపిణీ చేస్తున్నారు.
ఈ నెలలో ఆలస్యంగా...
ప్రతి నెల 1వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే బియ్యం ఈ నెలలో జిల్లాల పునర్విభజన వల్ల ఆలస్యంగా 8వ తేదీ నుంచి ప్రారంభించారు. దీంతో కొన్ని ప్రాంతాల్లో ఎండీయూ వాహనాల ద్వారా 21వ తేదీ వచ్చినా పంపిణీ కొనసాగుతూనే ఉంది. అంతేకాకుండా కేంద్రం ఇచ్చే ఉచిత బియ్యం 17వ తేదీ లోపు రేషన్ దుకాణాలకు చేరితే 18వ తేదీ నుంచి డీలర్లు పంపిణీ చేస్తారు. కానీ ఇంతవరకు దుకాణాలకు బియ్యం చేరలేదు. గోదాముల నుంచి దుకాణాలకు ఎప్పుడు సరఫరా చేస్తారో.. డీలర్లు ఎప్పుడు పంపిణీ చేస్తారోనని లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. అసలు ఈ నెలలో బియ్యం పంపిణీ చేస్తారా లేక రెండూ కలిపి మే నెలలో పంపిణీ చేస్తారా అని సందేహం వ్యక్తమవుతోంది.
పూర్తికాని మొదటి విడత
కేంద్రం ఇచ్చే ఉచిత బియ్యం పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఆదేశాలు రాలేదని సమాచారం. జిల్లాలో మొదటి విడత పంపిణీ పూర్తి కాకపోవడంతో రెండో విడత పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సుముఖంగా లేనట్లు సమాచారం. అందువల్ల ఇంతవరకు బియ్యం పంపిణీపై ఆదేశాలు ఇవ్వలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వచ్చేనెలలో ఏప్రిల్, మే మాసాలకు కలిపి రెండు విడతల్లో ఉచిత బియ్యం పంపిణీ చేయనున్నట్లు సమాచారం.