ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన
ABN , First Publish Date - 2022-11-24T22:22:36+05:30 IST
ప్రకృతి వ్యవసాయంతో ఆరోగ్యకరమైన పంటలతో పాటు అధిక దిగుబడులు పొందవచ్చునని ప్రకృతి వ్యవసాయ ఇంటర్నల్ కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్(ఐసీఆర్పీ) పి.సుబ్బరాయుడు తెలిపారు.
ఆత్మకూరు, నవంబరు 24 : ప్రకృతి వ్యవసాయంతో ఆరోగ్యకరమైన పంటలతో పాటు అధిక దిగుబడులు పొందవచ్చునని ప్రకృతి వ్యవసాయ ఇంటర్నల్ కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్(ఐసీఆర్పీ) పి.సుబ్బరాయుడు తెలిపారు. మండలంలోని కరటంపాడులో గురువారం టీటీడీ రైతులకు అందించే వరినారుకు ద్రవ జీవామృతం తయారు చేసే విధానం, ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంలో ద్రవ జీవామృతంతో సూక్ష్మజీవులు అభివృద్ధి చెంది, పైరు ఏపుగా పెరుగుతుందని వివరించారు. అదే క్రమంలో చీడపీడలను తట్టుకుని వేరు శాతం అభివృద్ధి చెందుతుందన్నారు. రైతులు అధిక దిగుబడుల కోసం ఎరువులు, క్రిమిసంహారక మందులు విచ్చలవిడిగా వాడుతుండడంతో నేల కలుషితమవుతుందన్నారు. దీంతో దిగుబడులు భారీగా పడిపోతున్నాయని పేర్కొన్నారు. అలాకాకుండా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో వ్యవసాయం చేయడం వలన భూమిలో సారం పెరగడంతో పాటు దిగుబడులు కూడా పెరుగుతాయని తెలిపారు. కార్యక్రమంలో ఎంటీ సుబ్బమ్మ, పీఆర్పీ నాగరాజు, మాధురి, సర్పంచ్ రేవతి తదితరులు పాల్గొన్నారు.