పోతిరెడ్డిపాళెం రోడ్డు సొగసు చూడతరమా!
ABN , First Publish Date - 2022-01-22T04:38:42+05:30 IST
మండల పరిధిలోని పోతిరెడ్డిపాళేనికి వెళ్లే రోడ్డు రాకపోకలకు ఇబ్బందికరంగా తయారైంది.
భారీ వర్షాలకు గుంతల్లో నిల్వ చేరిన నీరు
వాహనదారుల అవస్థలు
పట్టించుకోని అధికారులు
కోవూరు, జనవరి 21: మండల పరిధిలోని పోతిరెడ్డిపాళేనికి వెళ్లే రోడ్డు రాకపోకలకు ఇబ్బందికరంగా తయారైంది. నెల రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు, వరదలకు రోడ్డుపై చాలా చోట్ల గుంతలు ఏర్పడ్డాయి. ఇటీవల మూడు రోజులపాటు కురిసిన వర్షాలకు రోడ్డుపై వర్షపునీరు చేరింది. ఈ రోడ్డుపై పోతిరెడ్డిపాళెం గ్రామస్థులేకాక బుచ్చిరెడ్డిపాళెం, పాటూరు వైపు వెళ్లేవారు కూడా ప్రయాణిస్తుంటారు. నిత్యం వందలాదిమంది విద్యార్థులు, పాల వ్యాపారులు, రైతులు, ఉద్యోగులు నెల్లూరుకు ఈ రోడ్డు మార్గం ద్వారా వెళ్తుంటారు. రోడ్డుపై గుంతలు పడి నీరు నిల్వ ఉండటంతో బైక్లపై వెళ్లాలంటే ఇబ్బందిగా ఉందని యువకులు నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, రోడ్డు భవనాల, పంచాయతీరాజ్ శాఖాఽధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేసేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు.
నరకయాతన అనుభవిస్తున్నాం
ప్రతి నిత్యం మా ఊరికి ఈ రోడ్డుపై వెళ్లలేక నరకయాతన అనుభవిస్తున్నాం. మూడు నెలల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతోంది. వరదల అనంతరం మరమ్మతులు చేస్తారనుకున్నాం. కానీ ఇప్పటికీ పట్టంచుకోలేదు. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డుపై నీరు చేరి, గుంతలు నీటితో నిండాయి. ఆ నీరు ఎండలు వస్తేనే పోతాయి. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి.
- యద్దలపూడి నాగరాజు, ఎంపీటీసీ సభ్యుడు, పోతిరెడ్డిపాళెం