పగిలిన తాగునీటి పైపులైన్!
ABN , First Publish Date - 2022-11-28T23:00:42+05:30 IST
కావలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు నుంచి పట్టణంలోకి వెళ్లే ప్రధాన పైపులైన్ పట్టణంలోని ఉదయగిరి రోడ్డులో ఆర్వోబీకి ఉత్తరం పక్కన స్రవంతి చిన్న పిల్లల ఆసుపత్రి వద్ద పగిలి నీరంతా వృథాగా పోతోంది.
లీకేజీతో కలుషితమవుతున్న తాగునీరు
కావలి, నవంబరు 28: కావలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు నుంచి పట్టణంలోకి వెళ్లే ప్రధాన పైపులైన్ పట్టణంలోని ఉదయగిరి రోడ్డులో ఆర్వోబీకి ఉత్తరం పక్కన స్రవంతి చిన్న పిల్లల ఆసుపత్రి వద్ద పగిలి నీరంతా వృథాగా పోతోంది. లీకేజీ నీరు అక్కడ నుంచి అదే రోడ్డులో ఉన్న తెలుగు బాపిటిస్ట్ చర్చివరకు వెళ్లి రోడ్డుపై నిలిచి బురదమయం అవుతోంది. అధికారులు, పాలకులు పట్టించుకోక పోవటంతో తాగునీరు కలుషితమవుతోంది. గత 15 రోజులుగా ఇలాగే ఉన్నా సంబంధిత అధికారులు దానిని పట్టించుకోవడం లేదు. గతంలో చేసిన పనులకు సక్రమంగా బిల్లులు ఇవ్వకపోవటంతో పైపు లైను మరమ్మతులకు ఎవరూ ముందుకు రావడం లేదని తెలిసింది. అయితే లీకేజీ మరింత పెద్దదై దిగువ ప్రాంతానికి నీరు అందనపుడు చూద్దాం లే అని అధికారులు వదిలి వేసినట్లు తెలిసింది. దీంతో నీరంతా వృథాగా పోతూ ఆ రోడ్డంతా బురదమయంగా మారింది. ఈ ప్రాంతంలో తరచూ పైపులైన్ లేకేజీ అవుతుండడంతో సిమెంట్ రోడ్డు పగుల కొట్టి మరమ్మతుల అనంతరం రోడ్డును బాగుచేయకపోవడంతో రోడ్డంతా గుంటల మిట్టలుగా తయారైంది. ప్రస్తుతం పైపులైన్ లీకేజీ నీరు రోడ్డుపై ఉన్న ఆ గుంటలలో నిలిచి రోడ్డుంతా బురదమయంగా మారటంతో ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి పైపులైన్ లీకేజీని అరికట్టి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాల్సి ఉంది.