నక్కలగండిలో గల్లంతైన యువకుడి మృతి
ABN , First Publish Date - 2022-07-01T02:46:13+05:30 IST
స్నేహితులతో కలిసి ఈత కొట్టేందుకు బుధవారం గ్రామ సమీపంలోని నక్కలగండి రిజర్వాయర్లోకి దిగి గల్లంతైన యువకుడు గ
జాలర్ల సహాయంతో మృతదేహం వెలికితీత
వేంపాడులో విషాదఛాయలు
వరికుంటపాడు, జూన్ 30: స్నేహితులతో కలిసి ఈత కొట్టేందుకు బుధవారం గ్రామ సమీపంలోని నక్కలగండి రిజర్వాయర్లోకి దిగి గల్లంతైన యువకుడు గద్దె ప్రసాద్(27) మృతదేహాన్ని గురువారం జాలర్ల సహాయంతో వెలికితీశారు. వేంపాడు ఎస్సీకాలనీకి చెందిన ఆ యువకుడు తన స్నేహితులతో కలిసి రిజర్వాయర్ వద్దకు ఈత కొట్టేందుకు వెళ్లాడు. ఈ నేపథ్యంలో రిజర్వాయర్లోని నీటిలో కూరుకుపోయి గల్లంతవడంతో రెండు రోజులుగా గాలింపు చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్లు చేరుకొనేలోపే జాలర్ల సాయంతో మృతదేహాన్ని వెలికితీశారు. ఒక్కసారిగా బిడ్డ మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు, బంధువులు భోరున విలపించారు. కాలనీలోనూ విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా సుమారు కిలోమీటర్ దూరం వరకు కంపచెట్ల నడుమ మృతదేహాన్ని స్ధానికులతో కలిసి ఒడ్డుకు మోసుకొచ్చి మానవత్వం చాటుకున్న ఎస్ఐ బాలమహేంద్రనాయక్ను పలువురు మెచ్చుకున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.