నగరం.. నేరాల మయం !
ABN , First Publish Date - 2022-06-01T05:01:35+05:30 IST
ఇటీవల నగర నడిబొడ్డున వీఆర్సీ సమీపంలో విజయ్కుమార్ అనే యువకుడిని కత్తులతో పొడిచి చంపారు.
ఓ వైపు హత్యలు.. మరోవైపు దోపిడీలు
నెల్లూరులో లోపిస్తున్న శాంతిభద్రతలు
పట్టపగలే దాడులకు దిగుతున్న వైనం
విచ్చలవిడిగా రౌడీషీటర్ల సంచారం
పదే పదే నేరాలకు పాల్పడుతున్న పాత నేరస్థులు
భయాందోళనలతో ప్రజలు
నెల్లూరు నగరానికి ఏమైంది ? నిత్యం ఏదో ఒక చోట హత్య, చోరీ, దోపిడీలు, దౌర్జన్యాలు... ఎన్నడూలేని విధంగా ప్రశాంత నగరంలో ఈ పరిస్థితులు ఏమిటి ? అసలు పోలీసు వ్యవస్థ ఏం చేస్తోంది..? ఇవీ నగర ప్రజల నుంచి వినిపిస్తున్న ప్రశ్నలు ఇటీవల నగరంలో నెలకొన్న పరిస్థితులు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఎప్పుడో రెండు దశాబ్దాల క్రితం పట్టపగలు రోడ్డు మీద హత్యలు చేసే దారుణ పరిస్థితులు కనిపించగా, మళ్లీ ఇప్పుడు అదే పరిస్థితులు కనిపిస్తుండడం కలవరపెడు తోంది. ఇప్పుడు నగరంలో ఎక్కడ చూసినా వీటి గురించే చర్చించుకుంటున్నారు. సాంకేతిక ఎంతో పెరిగింది. ఎలాంటి నేరం చేసినా తప్పించుకునే ఆస్కారమే లేదు. అయినా నిందితులు ధైర్యంగా నేరాలకు పాల్పడుతున్నా రంటే ఎక్కడ పొరపాటు జరుగుతుందో పోలీసు వ్యవస్థ పరిశీలన చేసుకోవాల్సిన అవసరముందని నిపుణులు సూచిస్తున్నారు.
నెల్లూరు, మే 31 (ఆంధ్రజ్యోతి): ఇటీవల నగర నడిబొడ్డున వీఆర్సీ సమీపంలో విజయ్కుమార్ అనే యువకుడిని కత్తులతో పొడిచి చంపారు. ఇందులో ప్రధాన నిందితుడు రౌడీషీటర్ కావడం గమనార్హం. అంతకముందు జిల్లా కోర్టులో దొంగతనం జరగ్గా దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఈ నేరానికి పాల్పడింది ఇద్దరూ పాత నేరస్థులే. ఇటీవల నగరంలో బైక్లు మాయమవుతుండగా నిందితులను పోలీసులు పట్టుకున్నారు. వారంతా కూడా పాత నేరస్థులే. కొన్ని రోజుల క్రితం ఓ ప్రాంతంలో పార్టీ జరుగుతుండగా ఇద్దరు రౌడీషీటర్లు ఒకరిపై ఒకరు కత్తులతో దాడులు చేసుకున్నారు. దర్గామిట్ట పరిధిలో ఓ కేఫ్లో ఓ వ్యక్తి టీ తాగుతుండగా మరో రౌడీషీటర్ దాడి చేశాడు. కపాడిపాలెంలో ఓ రౌడీషీటర్ కత్తితో బెదిరించి ఓ వ్యక్తి నుంచి డబ్బులు లాక్కెళ్లాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇటీవల జరుగుతున్న నేరాల్లో అధికంగా పాత నేరస్థులే ఉంటున్నారు. పోలీసుల దృష్టిలో వీరు ఉన్నప్పటికీ పదే పదే నేరాలకు పాల్పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. నగరంలో సుమారు 200 మందికిపైగా రౌడీషీటర్లు ఉన్నారు. వందల సంఖ్యలో పాత నేరస్థులు ఉన్నారు. ఇటీవల వీరు విచ్చలవిడిగా సంచరిస్తూ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నారు.
నేరస్థులపై నిఘా ఏది ?
పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం చూస్తే పాత నేరస్థుల ఆధ్వర్యంలో మరికొంతమంది కొత్త నేరస్థులు తయారవుతున్నారు. ఈ పరిస్థితుల్లో పాత నేరస్థులను నియంత్రించాల్సిన అవసరముందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. పాత నేరస్థులపై నిఘా లేకపోవడమే నగరంలో అశాంతికి ప్రధాన కారణమా..? అంటే అవుననే సమాధానం వస్తుంది. గతంలో పాత నేరస్థులపై నిఘా ఉంచేందుకు జైల్ మానిటరింగ్ వ్యవస్థను పోలీసు శాఖను ఏర్పాటు చేసింది. జైలుకెళ్లిన, జైలు నుంచి తిరిగి వచ్చిన ప్రతీ నేరస్థుడిపై పోలీసులు నిఘా ఉంచేవారు. అలానే రౌడీషీటర్లను ప్రతీవారం పోలీసు స్టేషనకు పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చేవారు. దీంతో తమపై నిఘా ఉందన్న భయంతో పాత నేరస్థులు మళ్లీ నేరాలకు పాల్పడేందుకు వెనకాడేవారు. అయితే ఈ జైల్ మానిటరింగ్ వ్యవస్థ ప్రస్తుతం పూర్తి స్థాయిలో పనిచేయడం లేదనే విమర్శలున్నాయి. అందులోనూ రౌడీషీటర్లు, పాత నేరస్థులు ఎక్కువమందికి రాజకీయ అండదండలు ఉండడంతో పోలీసులు కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
సస్పెన్షనతో సరిపెడతారా?
కొన్ని రోజులుగా నగరంలో ప్రశాంతతకు భంగం కలుగుతుండడంతో పోలీసు ఉన్నతాధికారులు స్పందించా రు. పట్టపగలు నడిరోడ్డుపై హత్య జరిగిన నేపథ్యంలో విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు చిన్నబజారు పోలీసు స్టేషన ఇనస్పెక్టర్ను సోమవారం సస్పెండ్ చేశారు. అయితే ఈ సస్పెన్షనతో సరిపెడతారా? లేక మరిన్ని ముందస్తు దిద్దుబాటు చర్యలు తీసుకుంటారా..? అన్నది చూడాలి. జిల్లా పాలనా కేంద్రమైన నెల్లూరు నగరంలో డీఎస్పీ పోస్టు ఐదు నెలలుగా ఖాళీ ఉంది. అర్ధరాత్రి దాటాక కూడా నగరంలో మద్యం దొరుకుతుండడంతో చాలా చోట్ల రోడ్లపైనే మద్యం సేవిస్తూ ఉన్నారు. రాత్రిపూట గస్తీని పెంచడంతోపాటు పాత నేరస్థులపై ఉక్కుపాదం మోపకపోతే భవిష్యతలో మరిన్ని నేరాలు జరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.