లే అవుట్ పేరుతో ప్రజాధనం వృథా
ABN , First Publish Date - 2022-06-25T05:15:13+05:30 IST
పట్టణంలో ఎంఐజీ లే అవుట్ పేరుతో కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని
కందుకూరు, జూన్ 24: పట్టణంలో ఎంఐజీ లే అవుట్ పేరుతో కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి ఇంటూరి నాగేశ్వరరావు విమర్శించారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అవినీతి లేని పారదర్శక పరిపాలన అందిస్తున్నామని చెబుతున్న స్థానిక ప్రజా ప్రతినిధిని ఇలా చేయడం ఏమిటని ప్రశ్నించారు. 290 ప్లాట్లతో ఎంఐజీ లే అవుట్ వేయగా అక్కడ కనీసం 50 ప్లాట్లు కూడా బుక్ చేసుకోలేదని, కోటి రూపాయలు కూడా ఆదాయం వచ్చే పరిస్థితి లేకపోగా మౌలిక సదుపాయాల అభివృద్ధి పేరుతో నివాస యోగ్యం కాని స్థలంలో కోట్లు వృథా చేస్తున్నారని విమర్శించారు. గత ప్రభుత్వంలో 90 శాతంకు పైగా నిర్మాణం పూర్తిచేసిన జి ప్లస్ 3 గృహాలను కూడా మూడేళ్లుగా లబ్ధిదారులకు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతుండటం ఎంతవరకు సబబో చెప్పాలన్నారు. దుల్హన్ పథకానికి మంగళం పాడి మోసగించారన్నారు. టీడీపీ మైనారిటీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ రఫీ మాట్లాడుతూ ముస్లింల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్ నేడు మొండి చేయి చూపిస్తుండటం వెనుక పెద్ద కుట్ర ఉందని విమర్శించారు. రాష్ట్రంలో ఉర్థూ భాష కనుమరుగయ్యేలా నూతన విద్యా విధానం అమలుకాబోతున్నదని దీనిపై ఉద్యమించాలని కోరారు. సమావేశంలో పార్టీ నాయకులు గోచిపాతల మోషే, ఎన్.వి.సు బ్బారావు, ఎన్.వి.రమణయ్య, కె.శైలజ, ఎం.లక్ష్మీరాజ్యం, రాయపాటి శ్రీనివాస్, చదలవాడ కొండయ్య, కూనం నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.