మట్టి అక్రమ తరలింపు అడ్డగింత
ABN , First Publish Date - 2022-06-25T04:51:21+05:30 IST
మండలంలోని పోతిరెడ్డిపాళెంలోని చంద్రశేఖరపురం గిరిజనులకు కేటాయించిన స్థలంలో అక్రమార్కులు శుక్రవారం మట్టిని తరలిస్తుండగా స్థానికుల సహకారంతో గిరిజనులు అడ్డుకున్నారు.
గిరిజనులకు అక్రమార్కుల బెదిరింపు
నిరసనగా పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళన
కోవూరు, జూన్ 24: మండలంలోని పోతిరెడ్డిపాళెంలోని చంద్రశేఖరపురం గిరిజనులకు కేటాయించిన స్థలంలో అక్రమార్కులు శుక్రవారం మట్టిని తరలిస్తుండగా స్థానికుల సహకారంతో గిరిజనులు అడ్డుకున్నారు. దాంతో వారిని అక్రమార్కులు బెదిరించారు. వివరాల్లోకి వెళ్తే... 50 ఏళ్ల క్రితం ప్రభుత్వం 245 మంది గిరిజనుల ఇళ్ల స్థలాలకు 65 సెంట్ల స్థలాన్ని కేటాయించింది. అప్పటి నుంచి ఆ స్థలం గిరిజనుల ఆధీనంలోనే ఉంది. ఇటీవల కొందరు తమ పలుకుబడితో ఆ స్థలంలోని మట్టిని తరలించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. దీంతో గిరిజనులు కలెక్టరుకు విన్నవించారు. అక్కడ తవ్వకాలు చేపట్టకూడదని ఆయన ఆదేశాలు జారీ చేశారు. కొందరు వ్యక్తులు కలెక్టరు ఆదేశాలను కూడా తుంగలో తొక్కి మట్టిని తరలించేందుకు రెండు ఎక్స్కవేటర్లు, 15 ట్రాక్టర్లు తీసుకుని స్థలం వద్దకు చేరుకున్నారు. వారిని స్థానికుల సహకారంతో గిరిజనులు అడ్డుకున్నారు. తమను అడ్డుకున్నందుకు కోపోద్రిక్తులైన అక్రమార్కులు గిరిజనుల అంతుచూస్తామని బెదిరించి వెళ్లినట్లు తెలిసింది. ఘటనా స్థలానికి బీజేపీ నాయకులు పోట్లూరు శ్రీనివాసులు, ఐనకోటి రఘరామయ్య, కేతా పెంచలరెడ్డి చేరుకుని చంద్రశేఖరపురం గిరిజను లకు మద్దతు తెలిపారు. గిరిజనులకు కేటాయించిన స్థలంలో మట్టిని అక్రమంగా తరలిస్తే అడ్డుకుంటామని వారికి ధైర్యం చెప్పారు. అనంతరం చంద్రశేఖరపురం గిరిజనకాలనీవాసులు కోవూరు పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళన చేశారు. తమ స్థలం నుంచి అక్రమంగా మట్టిని తరలిస్తున్న వ్యక్తుల నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ ఎస్ఐ డీ వేంకటేశ్వరరావుకు వినతిపత్రం సమర్పించారు.