ముగిసిన గంగాభవాని ఉత్సవాలు
ABN , First Publish Date - 2022-06-08T03:18:29+05:30 IST
మండలంలోని గంగిరెడ్డిపల్లి గ్రామంలో వెలసి ఉన్న అనంతపూరి గంగాభవాని ఉత్సవాలు మంగళవారం వైభవంగా ముగిశాయి.
పోటెత్తిన భక్తులు
ఉదయగిరి రూరల్, జూన్ 7: మండలంలోని గంగిరెడ్డిపల్లి గ్రామంలో వెలసి ఉన్న అనంతపూరి గంగాభవాని ఉత్సవాలు మంగళవారం వైభవంగా ముగిశాయి. చివరి రోజున ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం బండ్లుపొంగళ్ల కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో చేపట్టారు. మహిళలు పొంగళ్ల సామగ్రిని నూతన బుట్టల్లో ఉంచుకుని మేళతాళాల మధ్య ఊరేగింపుగా ఆలయం వద్దకు చేరుకున్నారు. అనంతరం ఆలయ ఆవరణలో పొంగళ్లు నిర్వహించి అమ్మవారికి నైవేద్యంతోపాటు కాయాకర్పూరం సమర్పించి మొక్కులు తీర్చుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. వాహనాలను ప్రత్యేకంగా అలంకరించి ఆలయం చుట్టూరా ప్రదక్షణలు నిర్వహించారు. ఉత్సవాలకు పరిసర గ్రామాలకు చెందిన భక్తులు కూడా భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు అన్నదానంతోపాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ లతీపున్నీసా పోలీసు బందోస్తు నిర్వహించారు.