మూడు పొగాకు బ్యారన్ల దగ్ధం
ABN , First Publish Date - 2022-03-06T03:15:09+05:30 IST
మండలంలోని గానుగపెంట పంచాయతీ ఆదిమూర్తిపురం గ్రామంలో శనివారం మూడు పొగాకు బ్యారన్లు దగ్ధమయ్యాయి.
సుమారు రూ.10 లక్షల ఆస్తి నష్టం
కొండాపురం, మార్చి 5: మండలంలోని గానుగపెంట పంచాయతీ ఆదిమూర్తిపురం గ్రామంలో శనివారం మూడు పొగాకు బ్యారన్లు దగ్ధమయ్యాయి. సుమారు రూ.10 లక్షల ఆస్తి నష్టం జరిగింది. బాధితుల కథనం మేరకు... గ్రామానికి చెందిన కొందరు రైతులు నాలుగు బ్యారన్లు ఒకే ప్రదేశంలో నిర్మించుకున్నారు. అందులో ముత్యాల శ్రీధర్, తడకలూరు ధనమ్మ, తడకలూరు నాగరాజమ్మలకు చెందిన ఉమ్మడి బ్యారన్లో క్యూరింగ్ పూర్తయి పొగాకు కర్రలు దించేందుకు సిద్ధంగా ఉండగా ప్రమాదవశాత్తు నిప్పంటుకుంది. ఆర్పేందుకు ప్రయత్నించినా వీలులేకుండా మంటలు వ్యాపించాయి. దీంతో ఆ బ్యారిన్లో ముగ్గురు రైతులకు సుమారు రూ.5 లక్షల వరకు నష్టం జరిగిందని బాధితులు తెలిపారు. అలాగే ఈ బ్యారనను ఆనుకుని ఉన్న తడకలూరి బాలకోటయ్య, తడకలూరి సిద్ధయ్య, తడకలూరి కోటేశ్వరమ్మలకు చెందిన ఉమ్మడి బ్యారన్, కొమ్మి కొండయ్యకుచెందిన మరొక బ్యారన్లకు మంటలు వ్యాపించి పాక్షికంగా కాలిపోయాయి. దీంతో బ్యారన్లలో రూ.2.5 లక్షల చొప్పున నష్టం జరిగింది. సమాచారం అందుకున్న వింజమూరు అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి వారు చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.