ఇసుక డంపింగ్తో పొంచి ఉన్న ప్రమాదాలు
ABN , First Publish Date - 2022-08-18T03:36:31+05:30 IST
కావలి జడ్పీ ఉన్నత పాఠశాలలో నాడు-నేడు పథకం పేరుతో ఇసుక డంపింగ్ చేయటంతో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ప్రమా

కావలి, ఆగస్టు 17: కావలి జడ్పీ ఉన్నత పాఠశాలలో నాడు-నేడు పథకం పేరుతో ఇసుక డంపింగ్ చేయటంతో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ప్రమాదం పొంచి ఉందని సీపీఎం నాయకులు పేర్కొన్నారు. బుధవారం వారు పాఠశాలలో డంప్ చేసిన ఇసుకను, ఇసుక వాహనాల రాకతో పడిపోయిన గేటు దిమ్మెను పరిశీలించారు. సీపీఎం పట్టణ కార్యదర్శి పీ పెంచలయ్య మాట్లాడుతూ పట్టణంలో ఉన్న ఒకే ఒక జడ్పీ ఉన్నత పాఠశాలలో సుమారు 250 మంది విద్యార్థులు ఉన్నారన్నారు. పాఠశాలల విలీనం తర్వాత 3,4,5 తరగతులకు చెందిన చిన్నపిల్లలు కూడా వస్తున్నారని తెలిపారు. ఈ పాఠశాలకు ఒకే గేటు ఉండటంతో అందరూ ఒకే మార్గంలో రాకపోకలు సాగించాల్సి ఉందన్నారు. ఆ గేటు ద్వారానే ఇసుక తరలింపునకు వాహనాలు రాకపోకలు సాగించాల్సి ఉన్నందున ప్రమాదాలు పొంచి ఉన్నాయన్నారు. ఉన్నతాధికారులు స్పందించి అక్కడ ఇసుక డంప్ చేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు వై. కృష్ణమోహన్, పీ. పెంచలనరసింహం, మధుసూదన్రావు, డీవైఎఫ్ఐ నాయకులు మోతేసాయి, చిత్ర తదితరులు పాల్గొన్నారు.