ఈకైవైసీ తప్పనిసరి !
ABN , First Publish Date - 2022-05-29T02:43:53+05:30 IST
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజనకు అర్హులైన రైతులంతా ఈనెల 31వ తేదీలోపు ఈకేవైసీ చేయించుకోవాలని కేంద్ర, రాష్ట్ర
పీఎం కిసాన్ సమ్మాన్ యోజనకు
నెలాఖరు వరకు గడువు
సర్వర్ పనిచేయక నష్టపోతున్న రైతులు
ఉదయగిరి రూరల్, మే 28: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజనకు అర్హులైన రైతులంతా ఈనెల 31వ తేదీలోపు ఈకేవైసీ చేయించుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. ఈకేవైసీ, అడంగల్, పాసుపుస్తకాలు కలిగి ఉన్నా కూడా రైతులు ఈ పథకానికి దూరమయ్యే పరిస్థితి నెలకొంది. అడంగల్, పట్టాదారు పాసుపుస్తకాలు పొందిన రైతులు ఈకేవైసీ చేసుకొనేందుకు మండల వ్యవసాయ కార్యాలయాలు, నెట్ సెంటర్లు, ఆర్బబీకేలకు వెళ్లినా సర్వర్ సతాయిస్తుండడంతో వారు వెనుతిరుగుతున్నారు. సమయం దగ్గర పడుతుండడంతో కొంతమంది రైతులు ఆయా కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. దీంతో అర్హులైన రైతులు పథకానికి దూరమయ్యే దుస్థితి నెలకొంది.
అనర్హులను జల్లెడ పట్టేందుకే...
రైతులకు ఏడాదికి మూడు పర్యాయాలు రూ.2 వేల చొప్పున మొత్తం రూ.6 వేలు వ్యవసాయ పెట్టుబడి సాయంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా అందిస్తోంది. ఇప్పటివరకు పది విడతలు ఎలాంటి షరతులు లేకుండా సాయం చేసింది. తప్పుడు ఖాతాలతో అనర్హులు నగదు పొందకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి ఆధార్ అనుసంధానం తప్పనిసరిచేయడంతోపాటు ఈకేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించింది. ఈ విషయంపై రైతులకు అవగాహన లేక నష్టపోతున్నారు. ఈనెల 31వ తేదీన కేంద్ర ప్రభుత్వం పథకం నగదును రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. ప్రభుత్వం షరతులతో చాలామంది రైతులు ఈ పథకానికి దూరమవుతున్నారు. ఈకేవైసీ చేయించుకుంటేనే పథకానికి సంబంధించిన నగదు రైతుల ఖాతాల్లో జమవుతుందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.