ఈ ఏడాది నుంచి కేజీబీవీలో ఇంటర్ ప్రవేశాలు
ABN , First Publish Date - 2022-06-24T03:46:32+05:30 IST
: జిల్లాలోని 8 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయా(కేజీబీవీ)ల్లో ఇంటర్ కోర్సుల ప్రారంభానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇంట
సీతారామపురం, జూన్ 23: జిల్లాలోని 8 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయా(కేజీబీవీ)ల్లో ఇంటర్ కోర్సుల ప్రారంభానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇంటర్ ప్రథమ సంవత్సరం కోర్సుకు అనుమతిస్తూ రాష్ట్ర సమగ్ర శిక్షా అభియాన్ ఉత్తర్వులు జారీ చేసింది. 2018-19 నుంచే రాష్ట్రంలో 221 పాఠశాలల్లో ఇంటర్ విద్యను ప్రవేశ పెట్టగా, తాజాగా (2022-23 విద్యా సంవత్సరానికి) మరో 131 కేజీబీవీల్లో ఇంటర్ విద్యకు ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా జిల్లాలోని గుడ్లూరు(హెచ్ఈసీ గ్రూపు), కందుకూరు(అగ్రికల్చర్), లింగసముద్రం(హెచ్ఈసీ), ఉలవపాడు(ఎంపీసీ), కొండాపురం(ఎంపీసీ), కలిగిరి(ఎంపీహెచ్డబ్ల్యు), ఏఎస్పేట(బైపీసీ), సీతారామపురం(నర్సింగ్, ఎంపీసీ) కేజీబీవీల్లో ఈ విద్యా సంవత్సరం నుంచే ఇంటర్ విద్యను అమలు చేయనున్నారు. ఇంటర్ ప్రారంభమైతే ఆ కేజీబీవీల్లో విద్యార్ధినుల సంఖ్య పెరుగుతుంది. ఈ మేరకు బోధకులు, సిబ్బంది అవసరమవుతారు.