వరినాట్లలో తొలగిన కూలీల బెడద
ABN , First Publish Date - 2022-01-22T04:42:15+05:30 IST
వరుస తుఫాన్ల కారణంగా ఈ సీజన్లో రబీసాగు బాగా ఆలస్యమైంది. పోసిన నార్లు పనికిరాకుండా పోయాయి.
డ్రమ్ సీడర్పై పెరుగుతున్న ఆదరణ
పొదలకూరు రూరల్, జనవరి 21 : వరుస తుఫాన్ల కారణంగా ఈ సీజన్లో రబీసాగు బాగా ఆలస్యమైంది. పోసిన నార్లు పనికిరాకుండా పోయాయి. వర్షాలు వెలిశాక రైతులందరూ తిరిగి ఏకకాలంలో నార్లు పోయగా.. అవన్నీ ఒకే సమయంలో ఏతకు వచ్చాయి. దీంతో పొదలకూరు వ్యవసాయ సబ్ డివిజన్ ప్రాంతంలో కూలీల కొరత ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో ఎకరాకు రూ.4వేలు ఉన్న కూలీల ఖర్చులు, 7వేలకు పెరిగాయి. దీంతో సన్నకారు రైతులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. పరిస్థితిని అర్థం చేసుకున్న అధికారులు డ్రమ్ సీడర్ వినియోగంపై రైతులకు అవగాహన కల్పించారు. దీనిపై స్పందించిన రైతులు వీటిపై ఆసక్తి కనపరిచారు. దీనికి తోడు ఎకరాకు రూ.5వేల వరకు ఖర్చులు ఆదా అవుతుండడంతో ఈ కొత్తరకం వరిసాగుకు ముందుకొచ్చారు. పొదలకూరు, రాపూరు, కలువాయి, చేజర్ల మండలాల్లో ఈ రబీ సీజన్లో డ్రమ్ సీడర్ ద్వారా 1,040 ఎకరాల్లో వరి సాగు చేపట్టినట్లు వ్యవసాయాధికారులు తెలిపారు. ఈ పద్థతి ద్వారా నార్లు పోసుకోకుండా నేరుగా విత్తనాలు చల్లుతారు. దీంతో 30రోజుల పంట కాలం కలిసి వస్తుంది. పొదలకూరు ఏడీఏ నాగేశ్వరరావు మాట్లాడుతూ గింజలు విత్తిన ఆరో రోజున ఫైరజుసల్ఫారాన్ ఇథైల్ అనే కలుపు మందును 80 గ్రాములు ఎకరాకు 29 కిలోలు ఇసుకలో కలిపి చల్లుకోవాలని సూచించారు. విత్తిన 25రోజుల తర్వాత కలుపు నివారణకు ఫెనెక్సోప్రాస్ ఇథెల్లో కలిపి 3 దఫాలు పిచికారీ చేసుకోవాలన్నారు. అనంతరం ఎకరాకు 120 కిలోల యూరియా, 150కిలోల సూపర్ ఫాస్పెట్, 50 కిలోల డీఏపీ, 40 కిలోల పొటాష్ ఎరువులు వేసుకుంటే ఆశించిన దిగుబడి సాధించవచ్చని అధికారులు తెలుపుతున్నారు.