అంబేద్కర్ పేరుతో అరాచకం దారుణం
ABN , First Publish Date - 2022-05-29T03:01:24+05:30 IST
అంబేద్కర్ పేరుపై కోనసీమలో అరాచకం సృష్టించటం దారుణమని ఏపీ రైతు సంఘం కార్యదర్శి రావుల వెంకయ్య పేర్కొన్నారు.
ఏపీ రైతు సంఘం కార్యదర్శి రావుల వెంకయ్య
కందుకూరు, మే 28: అంబేద్కర్ పేరుపై కోనసీమలో అరాచకం సృష్టించటం దారుణమని ఏపీ రైతు సంఘం కార్యదర్శి రావుల వెంకయ్య పేర్కొన్నారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడంలో ప్రభుత్వం కనీస ప్రమాణాలు పాటించలేదన్నారు. శనివారం ఆయన కందుకూరులో విలేకరులతో మాట్లాడుతూ అక్కడ అల్లర్లకు నాయకత్వం వహించింది మా జడ్పీటీసీయేనని స్వయంగా మంత్రి విశ్వరూపే ప్రకటించటాన్ని బట్టి, దీని వెనుక ఎవరు ఉన్నారో అర్థమవుతూనే ఉన్నదన్నారు. ఏ ప్రయోజనాలను ఆశించి ఈ అరాచకం సృష్టించారని ఆయన ప్రశ్నించారు. ఇంత జరిగినా కోనసీమ జిల్లా మంత్రిని కాని, అక్కడి ఎమ్మెల్యేని కాని ముఖ్యమంత్రి జగన్, మంత్రులు పరామర్శించలేదంటే అర్థం ఏమిటని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో విపరీతంగా పెరిగిపోయిన నిత్యావసరాల ధరలు, డీజిల్ పెట్రోలు ధరలపై ఆందోళనలు చేయనున్నట్లు తెలిపారు.ఈ సమావేశంలో సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి పీ మాలకొండయ్య, పీ బాలకోటయ్య, బూసి సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.