ప్రతి గింజా అందే వరకు పోరాటం
ABN , First Publish Date - 2022-08-02T04:56:56+05:30 IST
పేదలకు అందాల్సిన ప్రతి గింజా అందే వరకు పోరాటం చేస్తామని టీడీపీ నెల్లూరు పార్లమెంటు అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ అన్నారు
నెల్లూరు(హరనాథపురం); ఆగస్టు 1 : పేదలకు అందాల్సిన ప్రతి గింజా అందే వరకు పోరాటం చేస్తామని టీడీపీ నెల్లూరు పార్లమెంటు అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ అన్నారు సోమవారం కలెక్టరేట్లో జరిగిన స్పందనలో టీజీపీ స్పెషల్ కలెక్టర్ బాపిరెడ్డికి రేషన్ సమస్యపై నెల్లూరు నగర నియోజకవర్గం ఇన్చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి జెన్నీ రమణయ్యలతో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అజీజ్ మాట్లాడుతూ ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఉచిత బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఐదు నెలల నుంచి పంపిణీ చేయకుండా ఆపేసిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.45 కోట్ల రేషన్ కార్డులు ఉంటే కేవలం 89లక్షల మందికి మాత్రమే పంపిణీ చేస్తున్నారని విమర్శించారు. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి పేదలకు పండుగలకు ఇచ్చే కానుకలను కూడా రద్దు చేశారని అన్నారు. నిరుపేదలకు అన్నంపెట్టే అన్న క్యాంటీన్లను రద్దు చేశారన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో 1.47కోట్లు ఉన్న రేషన్ కార్డులను వివిధ కారణాలను సాకుగా చూపి 1.45 కోట్లకు కుదించారన్నారు. కార్యక్రమంలో నాయకులు పనబాక భూలక్ష్మి, రాజా నాయుడు, పెంచల్ నాయుడు, జాఫర్షరీఫ్, జలదంకి సుధాకర్, సాబీర్ఖాన్, కనపర్తి గంగాధర్, దర్శి హరికృష్ణ, ఈదర శ్రీనివాసులు, కొమరి విజయ, జహీర్, కువ్వరపు బాలాజీ, అల్లబక్షు, శివాచారి, చెందయ్య తదితరులు పాల్గొన్నారు.
ముస్లిం సామాజిక వర్గానికి న్యాయం చేయాలి
మహమ్మద్ ఇంటిపేరుగల ముస్లిం సామాజిక వర్గానికి బీసీ-ఈ సర్టిఫికేట్లు జారీ చేయాలని కోరుతూ తెలుగుదేశంపార్టీ మైనార్టీ ముస్లిమ్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహ్మద్ జాఫర్ షరీఫ్ టీజీపీ స్పెషల్ కలెక్టర్ బాపిరెడ్డికి వినతిపత్రం అందచేశారు. నాయకులు షేక్ నన్నేసాహెబ్ తదితరులు పాల్గొన్నారు.