దారి...నీరు.. లేవు.. ఎలా కట్టుకోవాలి?
ABN , First Publish Date - 2022-07-03T06:11:36+05:30 IST
‘మీరు ఇచ్చిన స్థలం వద్దకు వెళ్లాలంటే దారి లేదు. ఇల్లు కట్టుకుందామంటే నీరు లేదు. కానీ అధికారులు రోజూ మా వద్దకు వచ్చి..ఇళ్లు కట్టుకోవాలని ఒత్తిడి చేస్తున్నారు.
- కలెక్టర్ వద్ద కన్నీటిపర్యంతమైన మహిళ
- వారంలోగా సమస్యను పరిష్కరించాలని ఆదేశం
గోనెగండ్ల, జూలై 2: ‘మీరు ఇచ్చిన స్థలం వద్దకు వెళ్లాలంటే దారి లేదు. ఇల్లు కట్టుకుందామంటే నీరు లేదు. కానీ అధికారులు రోజూ మా వద్దకు వచ్చి..ఇళ్లు కట్టుకోవాలని ఒత్తిడి చేస్తున్నారు. దారి...నీరు మీరే చూపించండి’ అంటూ ఓ మహిళ కలెక్టర్ వద్ద కన్నీటి పర్యంతమైంది. వివరాల్లోకి వెళితే... గోనెగండ్లలోని జగనన్న కాలనీలను కలెక్టర్ కోటేశ్వరరావు శనివారం పరిశీలించారు. 601 సర్వే నెంబర్లో ఉన్న జగనన్న కాలనీని పరిశీలించేందుకు వెళ్లిన కలెక్టర్ వద్దకు కటిక రజియా అనే మహిళ వచ్చి... ‘సార్... అధికారులు ఇల్లు కట్టుకోమని ఒత్తిడి చేస్తున్నారు. కానీ ఇక్కడికి రావడానికి దారి లేదు. కట్టు కోవడానికి నీరు లేద’ని వాపోయింది. ఆ మహిళ చెప్పిన సమస్యను విని కలెక్టర్ సం్పదించారు. ‘వచ్చే శనివారం లోపు ఈ సమస్య పరిష్కారం కావాలని... లేకపోతే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవ’ని హెచ్చరించారు. ఆర్డబ్ల్యూఎస్ డీఈ, ఏఈలు అక్కడే ఉండి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. జగనన్న కాలనీల్లో ఇళ్లు నిర్మించుకుంటున్న వారికి కావలసిన స్టీల్, సిమెంట్ సమస్య రాకుండా చూడాలని ఆదేశించారు. మరో మహిళ ఇసుక సమస్య ఉందని, ఒక ట్రాక్టర్ ఇసుక రూ. 6వేలు పలుకుతోందని కలెక్టర్ దృష్టికి తెచ్చింది. కార్యక్రమంలో తహసీల్దార్ వేణుగోపాల్, ఎంపీడీవో ప్రవీణ్కుమార్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ శ్రీనివాస రెడ్డి, ఈవో రంగనాయకులు పాల్గొన్నారు.