‘డప్పు కళాకారుల సమస్యలు పరిష్కరించాలి’
ABN , First Publish Date - 2022-03-05T05:37:07+05:30 IST
డప్పు కళాకారులు సమస్యలను పరిష్కరించాలని డప్పు కళాకారులు సంఘం తాలుకా అధ్యక్ష, కార్యదర్శులు భాస్కర్, కాలేబు, కేవీపీఎస్ నాయకులు ఆనందరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఎమ్మిగనూరు, మార్చి 4: డప్పు కళాకారులు సమస్యలను పరిష్కరించాలని డప్పు కళాకారులు సంఘం తాలుకా అధ్యక్ష, కార్యదర్శులు భాస్కర్, కాలేబు, కేవీపీఎస్ నాయకులు ఆనందరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం సంఘం ఆధ్వర్యంలో సోమప్ప సర్కిల్లో డప్పులు వాయిస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డప్పు కళాకారులు, చర్మకారుల పింఛన్ నమోదుకు సచివాలయాల్లో డిజిల్ సర్టిఫికెట్స్ ఇవ్వాలని లేదంటే సెల్ఫ్ డిక్లరేషన్తో నమోదు చేసుకునే విధంగా అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఇస్తున్న పింఛన్లు యథాతంగా కొనసాగించాలని కోరారు. అనంతరం ఎంపీడీవో బంగారమ్మకు వినతిపత్రం ఇచ్చారు.
మంత్రాలయం: చర్మ, డప్పు కళాకారుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కేవీపీఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు వీరేష్, అనిల్ అన్నారు. శుక్రవారం కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు జయరాజు ఆధ్వర్యంలో డప్పు కళాకారుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎంపీడీవో కార్యాలయం, అంబేడ్కర్ విగ్రహం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చర్మ, డప్పు కళాకారులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. పింఛన్, గజ్జలు, డప్పు, రాయితీ కింద ఇవ్వాలన్నారు. దళిత నిరుద్యోగులకు ఆర్థిక సాయం అందించాలని కోరారు. అనంతరం ఎంపీడీవో సూపరింటెండెంట్ శ్రీనివాసరెడ్డికి వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో కేవీపీఎస్ నాయకులు రాజు, దావీదు, ప్రకాష్, నర్సన్న, రాజు, పౌలు, అంజినప్ప, దేవసాయం పాల్గొన్నారు.
నందవరం: డప్పు కళాకారులపై ప్రభుత్వం మొండి వైఖరి వీడాలని కేవీపీఎస్ మండల అధ్యక్షుడు కనకవీడు రాజు అన్నారు. శుక్రవారం నందవరం మండల పరిషత్ కార్యాలయం ముందు వారు ధర్నా చేపట్టారు. పింఛన్ వస్తున్న డప్పు కలాకారులను సర్టిఫికెట్, ఐడెంటి కార్డు పేరుతో సతాయిస్తున్నారని, అవిలేని వారి పింఛన్ తొలగిస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రం ఏడీఏ జమ్మన్నకు అందజేశారు. ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి రంగన్న, తిక్కన్న, ఇమ్మానియేలు పాల్గొన్నారు.