పెట్రో, డీజిల్ ధరలను తగ్గించాలి
ABN , First Publish Date - 2022-05-26T06:38:10+05:30 IST
పెంచిన పెట్రో, డీజిల్ ధరలను తగ్గించాలని వామపక్ష నాయకులు డిమాండ్ చేశారు.
టీడీపీ, వామపక్షాల నిరసన
కర్నూలు(న్యూసిటీ), మే 25: పెంచిన పెట్రో, డీజిల్ ధరలను తగ్గించాలని వామపక్ష నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలో భాగంగా బుధవారం నగరంలోని పెట్రోల్ బంకుల ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఎం, సీపీఐ నగర కార్యదర్శులు రాజశేఖర్, చంద్రశేఖర్ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక నిత్యావసర వస్తువలు ధరలు అడ్డు అదుపు లేకుండా పెంచుతున్నారని మండిపడ్డారు. ఈనెల 30 కలెక్టరేట్ ముట్టడిని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. పెట్రోల్ బంకుల వద్ద కరపత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో వామపక్ష నాయకులు శ్రీనివాసులు, శ్రీరాములుగౌడు బీసన్న, మునిస్వామి, డీహెచ్పీఎ్స జిల్లా కార్యదర్శి మహేష్ పాల్గొన్నారు.
పత్తికొండటౌన్: ధరలను పెంచుకుంటూ పోతే సామాన్యులు ఎలా బతుకుతారని సీపీఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించారు. బుధవారం జాతీయ సమితి పిలుపులో భాగంగా బుధవారం పట్టణంలోని పెట్రోల్ బంకు వద్ద అధిక ధరలను తగ్గించాలని కోరుతూ సీపీఐ శ్రేణులు కరపత్రాలను పంపిణీ చేస్తూ ప్లేకార్డులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాన్య ప్రజలపై పెనుభారం పడే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత పోటీ పడి ఇష్టానుసారంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర ధరలు, కరెంట్ చార్జీలను సైతం పెంచడం ఏమిటని ప్రభుత్వాలపై మండి పడ్డారు. ఈనెల 30న జిల్లా కలెక్టరేట్ ఎదుట జరిగే ఆందోళన కార్యక్రమాలకు పార్టీలకు అతీతంగా ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి రాజాసాహెబ్, నాయకులు గురుదాసు, నాగేంద్రయ్య, ఈరన్న, గిడ్డయ్య, కాశీ, రాజశేఖర్, మద్దిలేటి పాల్గొన్నారు.
ఎమ్మిగనూరు: పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని కోరుతూ వామపక్షాల ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలోని పెట్రోల్ బంకు ఎదుట ఆందోళన చేశారు. ఈసందర్భంగా నాయకులు రామాంజనేయులు, హనుమంతు, పంపన్నగౌడ్, రంగన్న, రాజు, ప్రసాద్ మాట్లాడుతూ ధరలు అడ్డుఅదుపు లేకుండా పెంచి తూతూ మంత్రంగా తగ్గించారని విమర్శించారు. క్రూడ్ ఆయిల్ ధరలు అంతర్జాతీయ మార్కెట్లో తక్కువగా ఉన్నా ధరలు తగ్గించకపోవటం సరికాదన్నారు. అనంతరం పోస్టర్లను విడుదల చేశారు. కార్యక్రమంలో నాయకులు రాముడు, సోమేశ్వరరెడ్డి, సరేష్, చిన్నన్న, విరుపాక్షినాయుడు పాల్గొన్నారు.
కోడుమూరు: కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని సీపీఐ ఆధ్వర్యంలో బుధవారం పెట్రోల్ బంకుల ఎదుట ధర్నా చేశారు. కార్యక్రమంలో సీపీఐ, ఏఐటీయూసీ నాయకులు క్రిష్ణ, రాజు, తిమ్మప్ప, సుంకన్న పాల్గొన్నారు.
టీడీపీ ఆధ్వర్యంలో..
ఆదోని: పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గించాలని టీడీపీ జిల్లా పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి భూపాల్ చౌదరి డిమాండ్ చేశారు. బుధవారం టీడీపీ కార్యాలయం నుంచి నాయకులు, కార్యకర్తలతో పెద్ద ఎత్తున తిమ్మారెడ్డి బస్టాండు వద్ద పెట్రోలు బంకు వరకు ర్యాలీగా వెళ్లి నిరసన చేపట్టారు. ఈసందర్భంగా భూపాల్ చౌదరి మాట్లాడుతూ తాజాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ ధరలతోపాటు నిత్యావసరాల ధరలను కూడా తగ్గించాలని డిమాండ్ చేశారు. జగన్రెడ్డి ప్రతిపక్ష నేతగా చేపట్టిన పాదయాత్రలో పెట్రోలు, డీజిల్ ధరలపై గొంతు చించుకొని ప్రసంగించారని, అధికారంలోకి వస్తే పెట్రోలు, డీజిల్పై వ్యాట్ పూర్తిగా రద్దు చేస్తామన్నారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన 6నెలలోనే రెండుసార్లు పెట్రోల్, డీజిల్పై వ్యాట్ పెంచారని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు బుద్దారెడ్డి, నల్లన్న, అయ్యన్న, జయరాం, లక్ష్మీనారాయణ, ఆరేకల్లు రామకృష్ణ, కల్లుబావి మల్లికార్జున, రాము, చిట్టిబాబు, జగదీష్, వీరేష్, బాలాజీ, రామాంజి, షాదీకాబేగం, అంజినమ్మ, శ్రీదేవి, సజ్జాద్, తిమ్మప్న, చాగి గూలేప్ప, సూరి, ఆశోక్, పాల్గొన్నారు.