జీవోలను ఉపసంహరించుకోవాలి
ABN , First Publish Date - 2022-02-19T05:38:13+05:30 IST
రాష్ట్రంలో ఇండస్ట్రియల్ ఎస్టేట్లు, ఆటోనగర్లకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 5, 6లను ఉపసంహరించుకోవాలని టీడీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మౌలాన ముస్తాక్ అహమ్మద్ డిమాండ్ చేశారు.
- టీడీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ముస్తాక్ అహమ్మద్
నంద్యాల టౌన్, ఫిబ్రవరి 18: రాష్ట్రంలో ఇండస్ట్రియల్ ఎస్టేట్లు, ఆటోనగర్లకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 5, 6లను ఉపసంహరించుకోవాలని టీడీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మౌలాన ముస్తాక్ అహమ్మద్ డిమాండ్ చేశారు. శుక్రవారం నంద్యాలలోని తన కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఈ జీవోలను అమలు చేస్తే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మనుగడకు ముప్పు ఏర్పడుతుందని అన్నారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధికి, యజమానులకు సహకరించాల్సిన ప్రభుత్వం ఇబ్బందులు సృష్టించే జీవోలను విడుదల చేయడం సరికాదని అన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను గుర్తించి ప్రోత్సహించేందుకు జిల్లా స్థాయిలో జాయింట్ డైరెక్టర్, అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ఇండస్ర్టియల్ ప్రమోషన్ అధికారిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పరిశ్రమలకు ముడిసరుకులు సరఫరా చేయడం, మార్కెట్ సౌకర్యం కల్పించడం వంటి ప్రోత్సహం ఇస్తే పరిశ్రమలు మూతపడవని అన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన టీడ్కో గృహాలను లబ్ధిదారులకు అందజేయకుండా వైసీపీ ప్రభుత్వం తాత్సారం చేస్తుండడం దుర్మార్గమని అన్నారు. రాష్ట్ర బడ్జెట్లో జనాభా ప్రతిపాదికన ముస్లిం మైనార్టీలకు నిధులు కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.