ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి కన్నుమూత.. దిగ్భ్రాంతిలో వైసీపీ శ్రేణులు

ABN , First Publish Date - 2022-11-02T20:11:00+05:30 IST

నంద్యాల జిల్లా అవుకు పట్టణానికి చెందిన ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి (Challa Bhagiratha Reddy) బుధవారం సాయంత్రం 4 గంటల సమయంలో అనారోగ్యంతో కన్నుమూశారు.

ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి కన్నుమూత.. దిగ్భ్రాంతిలో వైసీపీ శ్రేణులు
Challa Bhagiratha Reddy

బనగానపల్లె: నంద్యాల జిల్లా అవుకు పట్టణానికి చెందిన ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి (Challa Bhagiratha Reddy) బుధవారం సాయంత్రం 4 గంటల సమయంలో అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. కొంతకాలంగా నిమోనియా, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. మూడు రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో భగీరథరెడ్డిని హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ మృతి చెందారు. చల్లా రామకృష్ణారెడ్డి, శ్రీదేవి దంపతుల రెండో కుమారుడు చల్లా భగీరథరెడ్డి 1976లో అవుకు పట్టణంలో జన్మించారు. వీరి స్వగ్రామం అవుకు మండలం ఉప్పలపాడు. భగీరథరెడ్డి ఎంఏ(పొలిటికల్‌ సైన్స్‌) చదివారు. భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

వైసీపీ ఎమ్మెల్సీగా చల్లా రామకృష్ణారెడ్డి 2021 జనవరి 1వ తేదీన మృతిచెందడంతో ఆయన కుమారుడు చల్లా భగీరథరెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. 2021 మార్చి 25వ తేదీన ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. భగీరథరెడ్డి భార్య శ్రీలక్ష్మి అవుకు జడ్పీటీసీ సభ్యురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. భగీరథరెడ్డి అంత్యక్రియలను గురువారం ప్రభుత్వ లాంఛనాలతో అవుకు పట్టణంలోని చల్లా ఫాంహౌస్‌లో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. భగీరథరెడ్డి మృతి పట్ల ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డితో పాటు నియోజకవర్గంలోని పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు సంతాపం తెలిపారు.

రాజకీయ ప్రస్థానం

తన తండ్రి చల్లా రామకృష్ణారెడ్డి అడుగు జాడల్లో నడుస్తూ కాంగ్రెస్‌ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 2003 నుంచి 2010 వరకు వివిధ హోదాల్లో పనిచేశారు. 2014లో టీడీపీలో చేరారు. 2019 మార్చి 8వ తేదీన తన తండ్రి చల్లా రామకృష్ణారెడ్డితో పాటు వైసీపీలో చేరారు.

Updated Date - 2022-11-02T20:11:02+05:30 IST