జయహో రాఘవేంద్రా..
ABN , First Publish Date - 2022-08-14T05:38:40+05:30 IST
జయహో ధ్వానాల మ ధ్య మంత్రాలయం మార్మోగింది
బంగారు రథంపై దర్శనం ఇచ్చిన స్వామివారు
బృందావనానికి మహా పంచామృతాభిషేకం
స్వామివారికి టీటీడీ పట్టువస్త్రాల సమర్పణ
మంత్రాలయం, ఆగస్టు 13: జయహో ధ్వానాల మ ధ్య మంత్రాలయం మార్మోగింది. దేశం నలుమూలల నుం చి వేలాది మంది భక్తులు మంత్రాలయం చేరుకోవడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది. 351వ సప్తరాత్రోత్సవాల్లో అత్యంత ముఖ్యమైన నాలుగో రోజు రాఘవేంద్ర స్వామి సజీవంగా బృందావనమైన మధ్యారాధనలో భాగంగా శనివారం మఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి మహా విశేష పంచామృతా భిషేకం నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి అధికారికంగా డిప్యూటీ ఈవో రమేష్బాబు అర్చకు లతో కలిసి పట్టు వస్త్రాలను తీసుకువచ్చారు. ముఖద్వారం నుంచి రాఘవేంద్ర స్వామి బృందావనం వరకు పట్టువస్త్రాలను ఘనంగా ఊరేగింపుతో తెచ్చి బృందావనం వద్ద పెట్టి పీఠాధిపతులను అలంకరించారు. అనంతరం రాఘవేంద్రస్వామి బంగారు కవచాన్ని స్వర్ణ రథంపై అధిష్టించి మహా మంగళహారతులు ఇచ్చారు. వేద పండితుల మంత్రోచ్ఛారణాలు, మంగళవాయిద్యాలు, భక్తుల హర్షధ్వానాల మధ్య రథం ముందుకు సాగింది. ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలను చెక్క, వెండి, బంగారు రథాలపై ఊరేగించారు. బెంగళూరు ప్రభాత్ ఆర్ట్ ఇంటర్నేషనల్ వారిచే శ్రీనివాస కళ్యాణ నృత్య ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంది. అదేవిధంగా బెంగళూరుకు చెందిన విద్వాన్ ఎస్వీ గిరిధర్, బెంగళూరుకు చెందిన రాయచూరు శేషగిరిదాస్ వార్లచే దాసవాని సాహిత్యం భక్తులను ఆకట్టుకున్నాయి. రాఘవేంద్రుల మహా రథోత్సవం ఆదివారం వైభవంగా జరగనుంది. కార్యక్రమంలో రాష్ట్రపతి అవార్డు గ్రహీత విద్వాన్ రాజా ఎస్ గిరిరాజాచార్, సుజీంద్రాచార్, గౌతమాచార్, ఆనంద తీర్థాచార్, ఏఏవో మాధవశెట్టి, మేనేజర్లు ఎస్కే శ్రీనివాసరావు, వెంకటేష్ జోషి, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, శ్రీపతిఆచార్, సీఆర్వోలు రవి కులకర్ణి, విజయేంద్రాచార్, జయతీర్థాచార్, ఈఈ సురేష్ కోనాపూర్, ఏఈ బద్రినాథ్, ద్వారపాలక అనంత స్వామి, ప్రకాష్ ఆచార్, భీమ్సేన్రావు, నకటే శ్యాంప్రసాద్, వ్యాసరాజాచార్, బీఎం ఆనందరావు, మంత్రాలయం సీఐ భాస్కర్, ఎస్ఐ వేణుగోపాల్ రాజు, మాధవరం ఎస్ఐ చంద్ర పాల్గొన్నారు.